వెయ్యి అబద్ధాలు, భీమవరం బుల్లోడు లాంటి సినిమాలతో హీరోయిన్గా ఆకట్టుకున్న ఎస్తేర్ నొరోహా.. త్వరలో ‘#69 సంస్కార్ కాలనీ’ సినిమాతో వస్తోంది. అజయ్, రిస్వి తిమ్మరాజు ఇతర ముఖ్య పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రానికి బి.బాపిరాజు, ముతికి నాగసత్య నారాయణ నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఎస్తేర్ మాట్లాడుతూ ‘ఇందులో నేను వైశాలి అనే గృహిణిగా నటించా. ఇలాంటి బలమైన పాత్రలో నటించడం గర్వంగా ఉంది. ట్రైలర్ చూసి బోల్డ్గా ఉందంటున్నారు. నిజానికి ఈ మూవీ కంటెంట్లో అదే నాకు కిక్ ఇచ్చింది.
చాలామంది జీవితాల్లో అలాంటి బోల్డ్నెస్ ఉంటుంది. కానీ ఎవరూ మాట్లాడుకోరు. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి చిత్రంలో నటిస్తే మంచి పేరొస్తుందని ఫీలయ్యాను. ‘రా రా’ అనే ఓ పాట కూడా పాడాను. సోషల్ మీడియాలో ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. నేను నటించిన ‘ఐరావతం’ కూడా రిలీజ్కి రెడీ అవుతోంది. ‘రుద్ర’ అనే మరో మూవీతో పాటు జీ5 కోసం ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను’ అని చెప్పింది.