- దీక్షావస్త్రాలు విప్పించారని స్కూల్ ప్రిన్సిపాల్ పై ఆగ్రహం
- స్కూల్ ముట్టడి.. రాస్తారోకో.. ఆఫీసు అద్దాలు ధ్వంసం
దండేపల్లి, వెలుగు: హనుమాన్మాల వేసుకున్న స్టూడెంట్స్ పట్ల ప్రిన్సిపాల్ జోబీ అనుచితంగా వ్యవహరించారంటూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి లోని మథర్ థెరిస్సా స్కూల్ వద్ద రామభక్తులు ఆందోళనకు దిగారు. కొద్దిసేపు రస్తారోకో చేశారు. మంగళవారం మాల వేసుకున్న 4వ తరగతి స్టూడెంట్స్ బంగారు దీవేన్, గొర్ల విద్యాదిత్య, హర్ష వర్ధన్ పరీక్ష రాసేందుకు స్కూలుకు వచ్చారు. ఎగ్జామ్ హాల్లో వారిని చూసిన జోబీ పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీక్ష వస్త్రాలను తొలగించి స్కూల్ యూనిఫామ్ వేసుకున్న తర్వాతే పరీక్ష రాయించారు.
ఈ విషయం తెలిసి వందలమంది హన్మాన్ స్వాములు, భక్తులు స్కూల్ దగ్గరకి వచ్చి నిరసనకు దిగి.. రాస్తారోకో చేశారు. పేరెంట్స్ తో కలిసి స్కూలును ముట్టడించి ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేశారు. మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాలతో అక్కడకు చేరుకుని ఆందోళన విరమింపజేయడానికి ప్రయత్నించారు. మాలధారులను అవమానించిన ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని, స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
దాంతో అక్కడకు వచ్చిన ఎంఇఓ రవీందర్ స్కూల్ పర్మిషన్ ఎందుకు రద్దు చేయకూడదో రెండు రోజుల్లో రిప్లై ఇవ్వాలంటూ యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మాల ధరించిన విద్యార్థులతో దీక్ష వస్త్రాలు విప్పించిన ప్రిన్సిపాల్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ అశోక్కుమార్ చెప్పారు. డీసీపీ హామీ మేరకు ఆందోళన విరమించారు.