
వాషింగ్టన్: వాణిజ్య సుంకాల కారణంగా ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. అమెరికా ఏకపక్షంగా టారిఫ్లు విధించడంతో ఇండియా అగ్రరాజ్యానికి మొల్లగా దూరమవుతోంది. అమెరికాతో బంధం తెంచుకుంటున్న భారత్.. ప్రత్యర్థి చైనాకు దగ్గర అవుతోంది. ఇండియాపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడాన్ని చైనా కూడా తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో ఇండియా, చైనా మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుంది.
ఇందులో భాగంగానే ఇటీవల చైనాలోని టియాంజిన్లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా జిన్ పింగ్, పుతిన్తో మోడీ భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించారు. సుంకాల పేరుతో ప్రపంచదేశాలపై ట్రంప్ అధిపత్యం చెలాయిస్తోన్న వేళ మోడీ, పుతిన్, జిన్ పింగ్ ఒక్కటి కావడం జియో పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది.
రష్యా, చైనా, భారత్ల బంధాన్ని ట్రంప్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. అమెరికాకు వ్యతిరేకంగా ఈ మూడు దేశాలు ఏకం కావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు. సుంకాల పేరుతో తన దారిలోకి తెచ్చకుందామని ప్రయత్నించినప్పటికీ అమెరికా బెదిరింపులను చైనా, రష్యా, భారత్ గడ్డితో పోచతో సమానంగా చూస్తున్నాయి. ఈ క్రమంలో భారత్, రష్యా, చైనాల బంధంపై ట్రంప్ బహిరంగంగానే తీవ్ర అక్కసు వెళ్లగక్కాడు.
►ALSO READ | ఆస్ట్రేలియాలో రేసిజం.. ఇండియన్సే టార్గెట్గా దాడులు.. బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న విదేశీయులు !
టియాంజిన్ సమావేశంలో పుతిన్, జిన్పింగ్లతో కలిసి ప్రధాని మోడీ ఉన్న ఫొటోను తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో షేర్ చేసిన ట్రంప్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చాడు. చైనా చేతిలో రష్యా, భారత్ను అమెరికా కోల్పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కపటబుద్ధి గల చైనాకు భారత్, రష్యా దగ్గరైనట్లు తెలుస్తోందని.. ఈ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మూడు దేశాలకు సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని కడుపు మంట వెళ్లగక్కారు ట్రంప్. ఇండియాపై ఎడాపెడా సుంకాలు విధించిన ట్రంప్.. ఇప్పుడేమో చైనా చేతిలో భారత్ను కోల్పోయామని మొసలి కన్నీళ్లు కార్చడంపై పలువరు విమర్శిస్తున్నారు. ఇండియాపై ఏకపక్షంగా సుంకాలు విధించి తప్పు చేశామని ట్రంప్కు ఇప్పుడు జ్ఞానోదయమైదంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.