రెండో రోజు ముగిసిన రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్​ ఫ్లాట్ల లాటరీ

రెండో రోజు ముగిసిన రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్​ ఫ్లాట్ల లాటరీ

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్​ ఫ్లాట్ల లాటరీ రెండో రోజు ముగిసింది. 12 కేటగిరీలో 1,895 ఫ్లాట్స్​కి 13,756 అప్లికేషన్లు రాగా, 1,692 మందికి ఫ్లాట్స్‌ కేటాయించినట్లు హెచ్‌ఎండీఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెకండ్ ప్రయారిటీలో మరో 179 సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ కేటాయించినట్లు వెల్లడించింది. 3 బీహెచ్‌కే డీలక్స్ కేటగిరీలో 343 ఫ్లాట్లకు 16,679 అప్లికేషన్లు రాగా, దీనికి సంబంధించి డ్రాను బుధవారం తీయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో డ్రాలో ఫ్లాట్స్‌ దక్కించుకున్న వారి వివరాలను హెచ్‌ఎండీఏ, స్వగృహ తెలంగాణ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లాట్ల లాటరీ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని, ఈ ప్రక్రియను యుట్యూబ్, ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది.