పాక్​ను భారత్ ​గౌరవించాలి.. మణిశంకర్ అయ్యర్ ఓల్డ్ వీడియో వైరల్

పాక్​ను భారత్ ​గౌరవించాలి.. మణిశంకర్ అయ్యర్ ఓల్డ్ వీడియో వైరల్
  •     రెచ్చగొడితే మనపై అణుబాంబులు వేయొచ్చన్న కాంగ్రెస్ నేత 
  •     ఇదే కాంగ్రెస్ పార్టీ విధానమంటూ బీజేపీ ఫైర్

న్యూఢిల్లీ :  మొన్న ఇండియన్ల​ కలర్​పై కాంగ్రెస్ నేత శ్యామ్ ​పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరువకముందే ఆ పార్టీకి చెందిన మరో సీనియర్​ నేత మణిశంకర్​ అయ్యర్​  చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి.   పాకిస్తాన్​వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే దాయాదిని భారత్​ గౌరవించాలని అన్నారు.  పాకిస్తాన్​తో చర్చలు జరపాలని, లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. సైన్యంతో ఆ దేశాన్ని రెచ్చగొడితే మనపై అణుబాంబులు ప్రయోగించే ఆలోచన చేయొచ్చని కామెంట్​ చేశారు. ‘మనవద్ద కూడా అస్త్రాలున్నాయి. కానీ, ఓ పిచ్చివాడు అణుబాంబును లాహోర్​పై ప్రయోగించాలని నిర్ణయిస్తే.. దాని తాలూకు రేడియేషన్​ అమృత్​సర్​ను చేరడానికి 8 సెకన్లు కూడా పట్టదు’ అని వ్యాఖ్యానించారు. మణిశంకర్​ అయ్యర్​ ఓ టీవీ ఇంటర్వ్యూలో కొద్దిరోజుల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలు తాజాగా వైరల్​ అయ్యాయి. అయితే, లోక్​సభ ఎన్నికల వేళ ఆయన కామెంట్స్​ వైరల్ కావడంతో కాంగ్రెస్​ పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి. కాగా, మణిశంకర్​ అయ్యర్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని కాంగ్రెస్ ప్రకటించింది. 

ఇదే కాంగ్రెస్​ ఐడియాలజీ :  బీజేపీ

ఇండియా పట్ల కాంగ్రెస్​ ఐడియాలజీ ఇదేనంటూ మణిశంకర్​ అయ్యర్​ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మణిశంకర్ ​వీడియోను ట్విట్టర్​ (ఎక్స్​)లో కేంద్రమంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ షేర్​ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్​ పార్టీ రియల్​ ఐడియాలజీ బయటపడుతోందని అన్నారు. “పాకిస్తాన్​కు సపోర్ట్​ చేయడం, అవసరమైతే అండగా ఉండటం.. సియాచిన్​ను వదులుకోవడం, ప్రజలను విభజించడం, అబద్దాలు, నకిలీ గ్యారంటీలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం.. ఇవే వారి సిద్ధాంతాలు’’ అని రాజీవ్​ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.