నిజామాబాద్, వెలుగు: బోనస్ ఆశతో మహారాష్ట్ర నుంచి సన్నవడ్లు జిల్లాకు వస్తున్నాయి. బార్డర్ దాటొచ్చిన వడ్ల లారీ ఈనెల 23న పట్టుబడింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. మరో పక్క జిల్లాలో సాగైన వానాకాలం వడ్ల కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. యాసంగి సీజన్లో సేకరించిన వడ్లు గోదామ్ల నుంచి ఖాళీ కాకపోవడంతో కొత్త వడ్లను నిల్వ చేసేందుకు స్థలం కొరత నెలకొంది. దీంతో కాంటాలు పెట్టిన వడ్లు ఎక్కడ దింపాలో అర్థంకాక సివిల్ సప్లయి ఆఫీసర్లు ఇబ్బంది పడుతున్నారు. తరుగు పేరుతో మిల్లర్లు రైతులను ముంచేందుకు సిద్దమయ్యారు.
మహారాష్ట్ర నుంచి వస్తున్న వడ్లు
ప్రభుత్వం 'ఏ' గ్రేడ్ వడ్లు క్వింటాల్కు రూ.2,389 , కామన్ రకానికి 2,369 చెల్లిస్తోంది. సన్నరకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండడంతో మహారాష్ట్ర నుంచి వడ్లను జిల్లాకు తరలిస్తున్నారు. కోటగిరి మండలం పోతంగల్, రెంజల్మండలం కందకుర్తి, సాలూరా, హంగర్గా మహారాష్ట్రను ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామాల రైతులు చాలా మంది మహారాష్ట్రలో భూములు కౌలు తీసుకొని వరి పండిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈనెల 23న సాలూరా చెక్పోస్టు మీదుగా వచ్చిన వడ్ల లారీని లోకల్ రైతులు గుర్తించి రెవెన్యూ ఆఫీసర్లకు సమాచారం అందించగా.. వారు లారీని పట్టుకున్నారు. అప్పటికే మహారాష్ట్ర నుంచి వచ్చిన వడ్లు సరిహద్దు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తూకం జరిగినట్టు గుర్తించి విచారణ చేస్తున్నారు. స్థానిక పట్టాపాస్ బుక్, ఏఈవో ధ్రువీకరణ ఉంటేనే తూకం వేయాలని, అవేమీ లేకుండా వడ్ల కాంటాలు ఎలా జరిగాయని ఎంక్వయిరీ చేస్తున్నారు.
మళ్లీ కడ్తా సేకరణ
సర్కార్ రూల్ ప్రకారం రైతుల వడ్లలో కోత పెట్టకూడదు. అయితే ప్రతి కొనుగోలు సెంటర్లో నిర్వహకులు రకరకాల పేర్లతో తరుగు తీస్తున్నారు. ప్రతి 40 కిలోల బస్తాకు కిలో అదనంగా తీసుకుంటున్నారు. అక్కడి నుంచి వెళ్లిన వడ్ల లారీ అన్లోడ్ చేయడానికి మిల్లర్ ప్రతి క్వింటాల్కు కిలోన్నర ధాన్యం కోత పెడుతున్నారు. దీనిని నిరసిస్తూ పోతంగల్ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు తహసీల్దార్ గంగాధర్ శనివారం ఏర్పాటు చేసిన మీటింగ్కు మిల్లర్లు అటెండ్ కాలేదు.
భారీ విస్తీర్ణంలో సాగు
వానాకాలం జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో 4.42 ఎకరాల్లో వరి సాగయ్యింది. 12.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన సివిల్ సప్లయి అధికారులు 9 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. యాసంగిలో కొనుగోలు చేసిన 8.40 లక్షల మెట్రిక్ టన్నుల్లో 5.62 టన్నుల సరుకు ఇంకా గోదాముల్లో ఉంది. దీంతో కొత్తగా స్టాక్ చేయడానికి స్థలం సమస్య వెంటాడుతోంది.
కాంటా పెట్టిన వడ్లు ఎక్కడికి పంపాలో తేలక సెంటర్ నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎడపల్లి మండలంలో రైతులు రాస్తారోకో చేయడంతో ఆ వడ్లను నాలుగు మిల్లులకు అలాట్చేశారు. ఓపెన్ ప్లేస్లో వడ్లు నిల్వ చేస్తున్న మిల్లర్లు వర్షాలు పడితే ధాన్యం తడిసిపోతుందని భయపడుతున్నారు.
