
అతి తక్కువ కాలంలోనే రెండు వందల సినిమాల్లో నాలుగు వందలకు పైగా పాటలు రాసి సెన్సేషన్ క్రియేట్ చేశారు కృష్ణకాంత్. రీసెంట్గా ‘రాధేశ్యామ్’ కోసం రాసిన పాట విడుదలై వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని ఇలా పంచుకున్నారు.
‘‘2009లో నా ఫ్రెండ్ శ్రవణ్ భరద్వాజ్, నేను కలిసి ‘కలయో నిజమో’ అనే ఆల్బమ్ చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత హను రాఘవపూడి ఇచ్చిన ట్యూన్కి పాట రాస్తే ‘అందాల రాక్షసి’లో రెండు పాటలు రాసే చాన్సిచ్చారు. ఆ పాటలు హిట్ కావడంతో వరుస అవకాశాలొచ్చాయి. అలా మొదలైన జర్నీ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా సాగుతోంది. రీసెంట్గా ‘రాధేశ్యామ్’ నుంచి నేను రాసిన ‘ఈ రాతలే’ పాట విడుదలై వైరల్ కావడం చాలా సంతోషంగా ఉంది. దర్శక నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాక రన్ దగ్గరుండి నాతో ‘రాధేశ్యామ్’ పాటలు రాయించుకున్నారు. అందుకే పాటలు చాలా బాగా వచ్చాయి. అయితే ఇందులో ఎంతో ఖర్చు పెట్టి తీసిన ఓ పాటని రికార్డింగ్ అయిపోయిన తర్వాత సిచ్యుయేషన్కి తగ్గట్లు లేదని తీసేశారు. మిగతా సాంగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా కుదిరాయి. ఐదు పాటలూ నేనే రాశాను.
‘ఈ రాతలే’ పాట వింటే చాలామందికి అర్థం కాదు. డిఫికల్ట్గా అనిపిస్తుంది. విజువల్గా చూస్తేనే అలా ఎందుకు రాశానో తెలుస్తుంది. ఇది 1970లో యూరప్లో జరిగే లవ్స్టోరీ. పునర్జన్మల కథ అని, టైమ్ ట్రావెల్ స్టోరీ అని, సై ఫై సినిమా అని, ట్రైన్లో జరిగే మూవీ అని.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇప్పటికి ఇలా ఊహలకే వదిలేద్దాం. సినిమా చూశాక అసలు కథేంటో తెలుస్తుంది. ఇప్పటి వరకు నేను ఎంతోమంది దర్శకులతో పని చేశాను. ఒక సినిమా చేసిన తరువాత వారికి నేను కంఫర్ట్ అని ఫీలైతే నెక్స్ట్ మూవీ చేస్తాను. అలా ఒకే దర్శకుడితో నాలుగైదు సినిమాలకు వర్క్ చేయడం జరుగుతోంది. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నాలుగు పాటలు రాశాను. మేజర్, హిట్ 2, నాగార్జున గారి ‘ద ఘోస్ట్’.. ఇలా చాలా సినిమాలకు వర్క్ చేస్తున్నాను. చాలా పాటలకు నాకు పేరు వచ్చినా ‘పడిపడి లేచే మనసు’లోని ఏమై పోయావే, ‘టాక్సీవాలా’లోని మాటే వినదుగా సాంగ్స్ జనాల్లోకి ఎక్కువగా వెళ్లాయి. పాకిస్థాన్, జపాన్ లాంటి దేశాల్లోని వారు కూడా నా పాటల్ని ట్విటర్లో ట్యాగ్ చేయడం చూస్తుంటే నాకు నిజంగా సంతోషంగా, తృప్తిగా అనిపిస్తోంది.’’