
ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే సవాలక్ష ప్రశ్నలు వేస్తుంటారు సిబ్బంది. ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతుంటారు. చాలా జంటలకు అవన్నీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే, తమకు అనువుగా ఉండే, ప్రైవసీకి అడ్డు తగలని హోటళ్లే కావాలంటున్నాయి జంటలు. నగరాల్లోని నేటి యువతరం ‘కపుల్ ఫ్రెండ్లీ’ హోటళ్లే కావాలంటోంది. ఒక రోజు లోపు స్టే కోసం ఆ హోటళ్లకే 72 శాతం మంది ఓటేశారు. స్టే కోసం పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయని హోటళ్లకు 80% మంది మొగ్గు చూపారు. ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ కంపెనీ గోఐబిబో చేసిన సర్వేలో ఈ విషయం తేలింది.
46% బుకింగ్లు లోకల్గా ఉండే యువత నుంచే వస్తున్నట్టు సర్వే తేల్చింది. మిగతా 54% వేరే ప్రాంతాల బుకింగ్లని పేర్కొంది. గత ఏడాది దాదాపు 50% మంది ఐదు కంటే ఎక్కువ సార్లు కపుల్ ఫ్రెండ్లీ హోటళ్లను బుక్ చేసినట్టు చెప్పారు. అందులో 33 శాతం మంది చెకిన్ అయిన రోజే చెకౌట్ అయ్యారు. తక్కువ ధరలు ఉండే హోటళ్లకు 61%, లొకేషన్ను బట్టి 55%, రేటింగ్ను బట్టి 53%, ప్రైవసీకి తగ్గట్టు 52% మంది, డిస్కౌంట్లు ఎక్కువిచ్చే హోటళ్లు కావాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. హోటల్ సిబ్బంది అనుమానంగా చూడడం చాలా ఇబ్బందిగా ఉందని సర్వేలో పాల్గొన్నవాళ్లు చెప్పారు.