వచ్చేది కాంగ్రెస్ ​ప్రభుత్వమే : మదన్​మోహన్​రావు

వచ్చేది కాంగ్రెస్ ​ప్రభుత్వమే : మదన్​మోహన్​రావు
  • ఆరు గ్యారంటీలను ఇచ్చి తీరుతాం
  • ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

సదాశివ్​నగర్ (కామారెడ్డి)​, వెలుగు: రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి మదన్​మోహన్​రావు పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. గురువారం సదాశివ్​నగర్​మండలంలోని యాచారం, ఉత్తునూర్, వజ్జేపల్లి,   తిమ్మోజీవాడి, తుక్కోజీవాడి, భూంపల్లి, లింగంపల్లి, మోడేగాం, పద్మాజీవాడి క్రాస్​రోడ్​లో మదన్​మోహన్​రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తనకు ఓటేసి గెలపించాలని కోరారు. కాంగ్రెస్ ​పార్టీ అధికారంలోకి వస్తే ఫించన్లు ఇతర పథకాలు ఆగిపోతాయంటూ గ్రామాల్లో బీఆర్ఎస్ ​లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారికి డిసెంబర్​3 తర్వాత బుద్ధి చెప్తామన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు కాంగ్రెస్​పార్టీ అండగా ఉంటుందన్నారు. ధరణి ద్వారా భూములు కోల్పోయిన ఎల్లారెడ్డి బిడ్డలకు న్యాయం చేస్తానన్నారు. అసైన్డ్​ భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మదన్​ చెప్పారు.

ఆదర్శ పాలన అందించి ఎల్లారెడ్డి నియోజక వర్గాన్ని స్టేట్​లోనే ఆదర్శంగా నిలుపుతానన్నారు.  ప్రతీ గ్రామంలో స్కూల్స్,  సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, సైడ్​డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని సైతం అభివృద్ధి పనులకే వినియోగిస్తానన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్​కార్యకర్తలు రూపాయి రూపాయి చందాలు వేసి సురేందర్​ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, అతడు కేసీఆర్​కు అమ్ముడు పోయాడన్నారు.

చైతన్యవంతులైన ఎల్లారెడ్డి బిడ్డలు  ఓటుతో సురేందర్​కు బుద్ధి చెప్పాలన్నారు. డబ్బు సంచులతో గెలిచేందుకు సురేందర్​ ప్రయత్నిస్తున్నారని, అతడి కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే  వ్యవసాయానికి ఉచిత విద్యుత్​తో పాటు,  రూ.500 గ్యాస్​సిలిండర్ ఇస్తామన్నారు. పెట్టుబడి సాయం కూడా అందిస్తామన్నారు.    లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.