ఇప్పుడంతా ఆరట్టై ట్రెండ్.. నెట్ సరిగ్గా లేకున్నా వాడుకునే సౌకర్యం.. వాట్సాప్లో లేని ఫీచర్లు..

 ఇప్పుడంతా ఆరట్టై ట్రెండ్.. నెట్ సరిగ్గా లేకున్నా వాడుకునే సౌకర్యం.. వాట్సాప్లో లేని ఫీచర్లు..
  • వాట్సాప్‌‌కు పోటీగా మేడిన్​ ఇండియా ఆరట్టై
  • సైలెంట్​గా ఎంట్రీ ఇచ్చిన మన మెసేజింగ్​ యాప్​
  • రోజూ సగటున 4 లక్షల డౌన్​లోడ్లు
  • ఈ నెల 3 నాటికి 75 లక్షలు దాటిన యూజర్స్‌‌
  • యాప్‌‌ను రూపొందించిన తమిళనాడుకు చెందిన జోహో సంస్థ
  • సెప్టెంబర్​ 22న ఐఫోన్​, 28న ఆండ్రాయిడ్​ వెర్షన్ ​రిలీజ్​
  • మారుమూల పల్లెల్లో నెట్ ​సరిగ్గా లేకున్నా వాడుకునే సౌకర్యం
  • వాట్సాప్​లో లేని ‘ఆండ్రాయిడ్​ టీవీ’ ఫీచర్​ కూడా 
  • జూమ్​ తరహా మీటింగ్‌‌లూ నిర్వహించుకునే వెసులుబాటు


హైదరాబాద్​, వెలుగు: వాట్సాప్‌‌‌‌కు గట్టిపోటీనిచ్చే మేడిన్‌‌‌‌ ఇండియా యాప్​ వచ్చేసింది. వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇటు ఆండ్రాయిడ్​.. అటు యాపిల్​ ఫోన్లలో నెంబర్​ వన్​ మెసేజింగ్​యాప్‌‌‌‌గా రికార్డులకెక్కింది. ఆ యాప్​ పేరు ఆరట్టై. అంటే ‘ముచ్చట లేదా మాట్లాడుకోవడం’ అని అర్థం. పూర్తిగా మన దేశీ చాటింగ్​ యాప్​ అది. 

తమిళనాడుకు చెందిన జోహో అనే సంస్థ ఈ యాప్​ను రూపొందించింది. వాస్తవానికి ఇది 2021 జనవరిలోనే సైలెంట్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చినా.. అంతగా జనాల్లోకి వెళ్లలేదు. కానీ, దానికి మరిన్ని హంగులు అద్ది.. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ కొత్తగా లాంచ్​ చేశారు. తొలుత యాపిల్​ ఫోన్లలోకే ఇది ఎంట్రీ ఇవ్వడం విశేషం. 

గత నెల​ 22న యాపిల్​ వెర్షన్​ ఆరట్టైని లాంచ్​ చేయగా.. ఆండ్రాయిడ్​ వెర్షన్‌‌‌‌ను  28న సరికొత్తగా తీసుకొచ్చారు. అలా కొద్దిరోజుల్లోనే ఈ నెల 3 నాటికే 75 లక్షల మందికిపైగా ఆరట్టై యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్​ చేసుకుని యూజర్లుగా మారిపోయారు. ఎక్కువగా ఆండ్రాయిడ్​ ఫోన్ల నుంచే డౌన్‌‌‌‌లోడ్స్ ఉండడం విశేషం. ఆండ్రాయిడ్​ ఫోన్​ యూజర్లలో 50 లక్షల మందికిపైగా, యాపిల్​ యూజర్లు 25 లక్షల మందికిపైగా ఈ యాప్‌‌‌‌ను ఇప్పటివరకూ డౌన్‌‌‌‌లోడ్​ చేశారు. అయితే, ఈ రెండు రోజులు కూడా కలుపుకుంటే.. మరో 10 లక్షల మంది కూడా యాడ్​ అయి ఉంటారని చెబుతున్నారు. తొలుత ఓ వారంపాటు రోజూ 3 వేల డౌన్‌‌‌‌లోడ్స్‌‌‌‌ ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య రోజూ సగటున 4 లక్షలకుపైగానే ఉంటున్నది. 

ఎందుకంత క్రేజ్..​ 

వాట్సాప్​కు పోటీగా స్నాప్ చాట్​, టెలిగ్రామ్‌‌‌‌లాంటి యాప్స్‌‌‌‌ వచ్చినా.. వాట్సాప్‌‌‌‌ను మాత్రం దాటి ముందుకు వెళ్లలేకపోయాయి. కానీ, ఆరట్టై మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌‌‌‌లో ఉన్నది. వాట్సాప్​ సహా మిగతా అన్ని మెసేజింగ్​ యాప్‌‌‌‌లను తలదన్ని ఆండ్రాయిడ్​, యాపిల్​ ఫోన్లలో నెంబర్​వన్​ యాప్​గా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ఉన్న మెసేజింగ్​యాప్స్‌‌‌‌లలో లేని సౌలతులు, ఫీచర్లు ఇందులో ఉండడం వల్లే ఇంతలా క్రేజ్ వచ్చిందని టెక్​ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌  చెబుతున్నారు. 

వాట్సాప్​ లాంటి మెసేజింగ్​యాప్స్‌‌‌‌ను వాడాలంటే నెట్​ స్పీడ్​ ఎక్కువగా ఉండాలి. అలాగే నెట్​ క్వాలిటీ ఉండాలి. అది కూడా పాత వెర్షన్​ ఆండ్రాయిడ్​, ఐఫోన్లలో పని  చేయదు. మారుమూల ప్రాంతాల్లో చాలా మందికి అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ ఫోన్లు ఉండడం లేదు. దీంతో చాలా మంది ఈ మెసేజింగ్​ యాప్​తో గ్యాప్​ ఏర్పడింది. ఆ గ్యాప్​నే ఆరట్టై భర్తీ చేస్తున్నది. మామూలు వెర్షన్, బడ్జెట్​ వెర్షన్​ ఆండ్రాయిడ్​ ఫోన్లలోనూ పనిచేసేలా ఆరట్టైని జోహో రూపొందించింది. 

దీనిని వాడేందుకు 5జీ లేదా 4జీ నెట్​ కూడా అవసరం లేదు. నెట్​ కనెక్టివిటీ తక్కువగా ఉన్నా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మెసేజ్‌‌‌‌లు పంపుకోవచ్చు. ఫొటోలు, డాక్యుమెంట్లను డౌన్‌‌‌‌లోడ్​ చేసుకోవాలన్నా.. సెండ్​ చేయాలన్నా డేటా అవసరం కూడా పెద్దగా ఉండదు. లో కనెక్టివిటీలోనూ వాటిని ఈజీగా షేర్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. అలాగే, డౌన్‌‌‌‌లోడ్​ చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. 

ఆండ్రాయిడ్​ టీవీ ఆప్షన్..

వాట్సాప్​, టెలిగ్రామ్‌‌‌‌లోలేని  ఒక యూనిక్​ ఫీచర్​ కూడా ఆరట్టై వైపు యూజర్లను ఆకర్షించేలా చేసింది. అదే ఆండ్రాయిడ్​ టీవీ ఆప్షన్​. ఇప్పటివరకు వాట్సాప్​లో కేవలం వెబ్​ బ్రౌజర్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్​ చేసుకునేందుకే అవకాశం ఉంది. కానీ, ఆరట్టైలో మాత్రం టీవీకి కూడా కనెక్ట్​ చేసుకునేలా అదనపు ఫీచర్‌‌‌‌‌‌‌‌ను జోడించారు.  

‘ఆండ్రాయిడ్​ టీవీ’ ఆప్షన్‌‌‌‌ను ఇచ్చి నేరుగా టీవీకి కనెక్ట్​ చేసుకునేలా హంగులు అద్దారు. ఆండ్రాయిడ్​ ఫోన్లతోపాటు యాపిల్​ ఫోన్లలోనూ ఈ సౌకర్యం ఉండడం ప్లస్​ పాయింట్‌‌‌‌గా మారింది. ఇటు ఈ మెసేజింగ్​ యాప్‌‌‌‌లోనే జూమ్​ తరహా మీటింగ్‌‌‌‌లనూ నిర్వహించుకునే మరో ఆప్షన్​కూడా ఉంది. ఇప్పటిదాకా వాట్సాప్​సహా ఏ మెసేజింగ్​యాప్‌‌‌‌లోనూ ఈ ఫీచర్​ లేదు. 

జోహో నుంచి మరిన్ని దేశీ ప్రొడక్ట్స్‌‌‌‌

జోహో సంస్థ ఒక్క ఆరట్టై కాదు.. మరిన్ని ప్రొడక్టులనూ తీసుకొచ్చింది. జోహో ఉలా, జోహో మెయిల్​, బాస్​ ఓఎస్​, ఇండస్​ యాప్‌‌‌‌​స్టోర్ లాంటి  మరిన్ని ప్రొడక్టులను అభివృద్ధి చేసింది. మన దేశ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరట్టైతోపాటు వీటిని రూపొందించింది.  ప్రైవసీకి కూడా పెద్దపీట వేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అత్యంత కట్టుదిట్టంగా డెవలప్​ చేసింది. దేశంలోని అన్ని భాషలనూ సపోర్ట్​ చేసేలా యాప్‌‌‌‌ను రూపొందించింది. ఇంటర్నేషనల్​ సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా  వీటిని ఆ సంస్థ తయారు చేయడం విశేషం.  

మరికొన్ని ప్రొడక్ట్స్​ ఇవే..

జోహో ఉలా: ఇది గూగుల్​, గూగుల్​ క్రోమ్, సఫారీల్లాగా ఒక బ్రౌజర్​. డెస్క్​టాప్​, మొబైల్​ వెర్షన్లలో ఈ బ్రౌజర్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. డిఫరెంట్​ఆన్‌‌‌‌లైన్​యాక్టివిటీస్​కు వివిధ మోడ్స్‌‌‌‌తో దీనికి రూపకల్పన చేసింది. 
జోహో షూట్​: మామూలుగా మైక్రోసాఫ్ట్‌‌‌‌లో వర్డ్​, ఎక్సెల్, మెయిల్‌‌‌‌లాంటి వాటిని ఇస్తుంటారు. జోహో కూడా సొంతంగా అలాంటి వాటిని తీసుకొచ్చింది. జోహో మెయిల్​, వర్క్​ డ్రైవ్​ (స్టోరేజ్), షో, రైటర్​, షీట్స్​, మీటింగ్​, ఫామ్స్, క్యాలెండర్‌‌‌‌‌‌‌‌లాంటి వాటిని అభివృద్ధి చేసింది. ఇందులో బేసిక్​ ఫ్రీ యాక్సెస్‌‌‌‌తోపాటు సబ్‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌తోనూ వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నది.  
బాస్​ ఓఎస్​: ప్రస్తుతం మైక్రోసాఫ్ట్​ ఓఎస్​(విండోస్), మ్యాక్​ ఓఎస్‌‌‌‌నే చాలా కంప్యూటర్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లలో వాడుతున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా దేశీ ఆపరేటింగ్​ సిస్టమ్‌‌‌‌ను జోహో డెవలప్​ చేసింది. ‘భారత్​ఆపరేటింగ్​ సిస్టమ్​ సొల్యూషన్స్’​ (బాస్​ ఓఎస్​) పేరిట దీన్ని అభివృద్ధి చేసింది.  మన దేశ భాషలను సపోర్ట్​ చేసేలా రూపొందించిన ఈ ఓఎస్‌‌‌‌ను సంస్థ ఫ్రీగా అందిస్తున్నది. 
ఇండస్​ యాప్​ స్టోర్​: ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌కు పోటీగా ఆండ్రాయిడ్​ ఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్​ డౌన్‌‌‌‌లోడ్​ ప్లాట్​ఫాం ఇది. 12 భాషలను సపోర్ట్​ చేస్తుంది. యూజర్లు, డెవలపర్లకు ఫ్రీ యాక్సెస్‌‌‌‌ను కల్పిస్తున్నారు.