ఆరిపోయే దీపానికి అధికారులు సహకరించొద్దని కాంగ్రెస్ నేత మధుయాష్కి సూచించారు. ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించొద్దని హెచ్చరించారు. కమీషన్ల కసమే కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి సహకరించిన అధికారులను వదలబోమన్నారు. ప్రగతి భవన్ నుంచి వందల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆస్తులను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబాన్ని వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కమీషన్ల కోసమే ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ కేటీఆర్ చెబుతున్నారని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు.
వచ్చేది మా ప్రభుత్వమే
డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ సర్కార్ మారడం ఖాయమని...అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ రెండు మూడు రోజుల్లో అడ్డగోలు వ్యవహారాలు చేయొద్దన్నారు.
ఈ రెండు మూడు రోజుల్లో కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు భట్టి. రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు అధికారులు చేయొద్దని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర అధికార పార్టీ కుట్రలు చేసే ప్రమాదం ఉందన్నారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు ఏదైనా చేస్తారని చెప్పారు భట్టి.