ఆమె ఓ పిల్లల డాక్టర్. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో రెండో అతిపెద్ద పదవి అయిన లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు. ఆ పదవి పొందిన మూడో మహిళగా రికార్డులకెక్కారు. ఆమె మాధురీ కనీత్కర్. ఇక, ఈ పదవి పొందిన తొలి పీడియాట్రీషియన్ కూడా ఆమె కావడం విశేషం. ఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్(డీసీఐడీఎస్)లోని మెడికల్ విభాగం డిప్యూటీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. మాధురి భర్త రాజీవ్ కూడా సైన్యంలోనే పని చేస్తున్నారు. ఆయన కూడా లెఫ్టినెంట్ జనరల్ ఆఫీసర్. ఈ నేపథ్యంలో భారత సైన్యంలో ఈ ర్యాంక్ పొందిన తొలి భార్యాభర్తలుగానూ వీరు గుర్తింపు పొందారు. మాధురి 37 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ‘‘ఈ సంస్థ మహిళలు ఎదగడానికి అవకాశాలను కల్పిస్తుంది. ఈ ఆర్గనైజేషన్లో మహిళలకు సేఫ్టీ, రెస్పెక్ట్ ఉంటుంది. మీరు యూనిఫామ్లో ప్రతిరోజూ చిన్నపిల్లల్లాంటి ఉత్సాహంతో, చాలెంజెస్ను ఫేస్ చేస్తూ ముందుకెళ్తే ఏదైనా సాధించగలరు. సగం ప్రపంచాన్ని మీరు తీసుకోవచ్చు… కానీ పూర్తి ప్రపంచానికీ ఇవ్వొచ్చు” అని ఆమె మహిళలకు సందేశమిచ్చారు.
పోయినేడాదే ర్యాంక్…
నిజానికి పోయినేడాదే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్కు ఎంపికయ్యారు మాధురీ కనీత్కర్. అయితే పోస్టు ఖాళీ లేకపోవడంతో ఆమెకు బాధ్యతలు అప్పగించలేదు. ఇప్పుడు ఖాళీ కావడంతో ఆమె శనివారం లెఫ్టినెంట్ జనరల్గా నియమితులయ్యారు. ఇది త్రీ స్టార్ ఆఫీసర్ హోదా. త్రీ స్టార్ హోదా కలిగిన ఆఫీసర్లు నేవీలో వైస్ అడ్మిరల్గా, ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా, ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ మార్షల్ ర్యాంకులు కలిగి ఉంటారు. ఇక ఇండియన్ మిలటరీలో లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ పొందిన తొలి మహిళ పునీతా అరోరా. ఆమె తర్వాత ఈ ర్యాంక్ను అందుకున్న రెండో భారతీయ మహిళగా పద్మావతి బందోపాధ్యాయ గుర్తింపు పొందారు. ఆమె తొలి మహిళా ఎయిర్ మార్షల్గా రికార్డు సృష్టించారు.
ఏఎఫ్ఎంసీలో టాపర్…
లెఫ్టినెంట్ జనరల్ మాధురీ కనీత్కర్ పీడియాట్రిక్స్ లో పీజీ చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో పీడియాట్రిక్ నెఫ్రాలజీలో శిక్షణ పొందారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్ఎంసీ)లో టాపర్. రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ కూడా సాధించారు. చిన్నారుల్లో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు పుణె, ఢిల్లీలో యూనిట్స్ పెట్టారు. 2017లో ఏఎఫ్ఎంసీకి తొలి ఉమెన్ డీన్గా నియమితులయ్యారు. పోయినేడాది ఉదంపూర్లోని మెడికల్ విభాగం మేజర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు.