ముంబై: ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామన్న బీజేపీకి మహా వికాస్ ఆగాధి కూటమి గట్టి షాకిచ్చింది. ఫడ్నవీస్ బలపరీక్షపై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, సోనియా గాంధీ అత్యంత వ్యూహాత్మకంగా తమ ఎమ్మెల్యేలతో సోమవారం రాత్రి పరేడ్ చేయించారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్కు చెందిన మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గంటన్నరపాటు సాగిన ఈవెంట్లో.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు.. కూటమిగానే కొనసాగుతామని, బీజేపీని అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం జరిగినంతసేపూ ఆ ప్రాంగణమంతా ‘‘లాంగ్ లివ్ మహా వికాస్ ఆగాధి”నినాదాలతో మారుమోగిపోయింది. ఎమ్మెల్యేలను ఉద్దేశించి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీప్ శరద్ పవార్, మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. మూడు పార్టీల ఎంపీలు, ఇతర కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇది మారాఠా గడ్డ.. జాగ్రత్త: పవార్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పవర్ను మిస్యూజ్ చేయడం బాగా అలవాటైందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. పరేడ్లో కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘గతంలో కర్నాటక, గోవా, మణిపూర్లోనూ బీజేపీ అడ్డదారిలో అధికారాన్ని చేపట్టింది. మరాఠా గడ్డమీద మాత్రం వాళ్ల ఆటలు సాగబోవు. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 162 మంది ఎమ్మెల్యేల మెజార్టీ బలం మనకే ఉంది. అతి త్వరలోనే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాం. ఫ్లోర్ టెస్టులో ఈజీగా గెలుస్తాం. మీ162 మందిని అసెంబ్లీకి తీసుకెళ్లే బాధ్యత నాది’’అని భరోసా ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఒక వ్యక్తి చెప్పే మాటల్ని ఎవరూ పట్టించుకోవద్దంటూ పరోక్షంగా అజిత్ పవార్ ను ఉద్దేశించి శరద్ పవార్ కామెంట్ చేశారు.
ఇప్పటికైనా ఫడ్నవీస్ తప్పుకోవాలి: థోరాట్
గ్రాండ్ హయత్ హోటల్లో కూటమి ఎమ్మెల్యేల సంఖ్య చూసిన తర్వాతైనా సీఎం పోస్టు నుంచఫడ్నవీస్తప్పుకోవాలని మహారాష్ట్ర పీసీసీ చీఫ్ బాలాసాహెబ్ థోరాట్ అన్నారు. ‘‘మహా వికాస్ అగాది కూటమి మొదటి మీటింగే ఇంత గ్రాండ్గా జరిగింది. వచ్చే ఐదేండ్లు ఇదే ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తా” అని చెప్పారు. మహారాష్ట్ర విషయంలో ఎంతవరకైనా పోరాడుదామని పార్టీ నేతలకు సోనియా నిర్దేశించినట్లు ఏఐసీసీసీ వర్గాలు తెలిపాయి.