- ఇప్పుడున్న యూనిట్ ధర రూ.6.30 చాలా ఎక్కువ టీజీఈఆర్సీకి ఇరిగేషన్ శాఖ లేఖ
- హైడల్ పవర్కు మా నీళ్లు వాడుకుంటూ రాయల్టీ కడుతున్నరు
- మేము కూడా విద్యుదుత్పత్తి సంస్థల్లాగే రాయల్టీ చెల్లిస్తం
- లేదంటే యూనిట్ విద్యుత్ తయారీకి అయ్యే ఖర్చునే కడ్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు కరెంట్ రేట్లను తగ్గించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (టీజీఈఆర్సీ)ని ఇరిగేషన్ శాఖ కోరింది. ఇప్పుడు యూనిట్ కరెంట్కు జెన్కో, ట్రాన్స్కోలు చార్జ్ చేస్తున్న ధర అధికంగా ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు కరెంట్ రేట్లను సవరించాలని కోరుతూ టీజీఈఆర్సీకి ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది.
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు ఇప్పుడు యూనిట్ కరెంట్కు రూ.6.30 వసూలు చేస్తున్నారని, అది చాలా ఎక్కువని, హేతుబద్ధత కూడా లేదని పేర్కొన్నది.
జల విద్యుత్ ఉత్పత్తిలో ఒక్క యూనిట్ ప్రొడ్యూస్కు ఎంత ఖర్చవుతుందో అంతే లిఫ్ట్ స్కీములకు చార్జ్ చేయాలని, లేదంటే వర్షాకాలంలో ట్రాన్స్కో ఇతర సంస్థల నుంచి కొంటే ఎంతవుతుందో అంతే బిల్లు వేయాలని డిమాండ్ చేసింది. అంతేగాకుండా ప్రభుత్వ లిఫ్ట్ స్కీములకు నెలనెలా ఒక కిలో వాట్కు వసూలు చేస్తున్న డిమాండ్ చార్జీలు రూ.300ను రద్దు చేయాలని కోరింది.
లిఫ్టులు పనిచేసేది రెండు నెలలే..
తెలంగాణ ప్రాతం భౌగోళికంగా ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో లిఫ్టులు అనివార్యమని లేఖలో ఇరిగేషన్ శాఖ పేర్కొన్నది. 450 మీటర్ల నుంచి 650 మీటర్ల ఎత్తు వరకు ఎత్తిపోయాల్సి వస్తున్నదని తెలిపింది. అందుకు ప్రస్తుతం 40 మెగావాట్ల నుంచి 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులను వినియోగిస్తున్నామని తెలిపింది. 2025, డిసెంబర్ 1 నాటికి 4 భారీ లిఫ్టులు పనిచేస్తున్నాయని, వాటి లోడ్ 2819.80 మెగావాట్లు అని పేర్కొన్నది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో 9 లిఫ్టులు 2026–27 నాటికి అందుబాటులోకి వస్తాయని, 7,348 మెగావాట్ల లోడ్ పడుతుందని తెలిపింది. పంపింగ్ ఎత్తు, ఓల్టేజ్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని లిఫ్టులను 20 % ఓవర్ లోడ్ తీసుకునేలా డిజైన్ చేశారని, అంటే రికార్డెడ్ లోడ్ 80 శాతం ఉంటుందని తెలిపింది. ఈ లెక్కన 4 లిఫ్టులకు 20 శాతం ఓవర్ లోడ్ తీసేస్తే అసలు లోడ్ 2,255.84 మెగావాట్లుగా ఉంటుందని, అందుబాటులోకి వచ్చే 9 లిఫ్టులకు 7,348 మెగావాట్లలో 20 శాతం ఓవర్లోడ్ పోనూ 5878.40 మెగావాట్లే అసలైన లోడ్ అని వెల్లడించింది.
పెద్ద లిప్టులన్నీ వర్షాకాలంలోనే 45 నుంచి 60 రోజుల (2 నెలలు) పాటు పనిచేస్తాయని తెలిపింది. మిగతా 10 నెలలు వాడకం ఉండదని తెలిపింది. వాస్తవ లోడ్లో కేవలం 10 నుంచి 15 శాతం వినియోగమే ఉంటుందని పేర్కొన్నది. అది కూడా కేవలం లైటింగ్, ఏసీ, వెంటిలేషన్, పంపుల డీ వాటరింగ్ కోసమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి 55 చిన్న లిఫ్టులుండగా.. వాటి లోడ్ 5,031.57 మెగావాట్లు అని తెలిపింది.
2026 – 27 నాటికి మరో 25 అందుబాటులోకి వస్తాయని, వాటి లోడ్ 993.55 మెగావాట్లు అని తెలిపింది. వీటిలో 20 శాతం ఓవర్లోడ్ను తీసేస్తే.. అసలు లోడ్ 4,025.25 మెగావాట్లు, 794.84 మెగావాట్లుగా ఉంటుందని పేర్కొన్నది. ఈ లిఫ్టులు ఏడాదిలో 6 నెలలు పనిచేస్తాయని, మిగతా 6 నెలలు ఆఫ్లోనే ఉంటాయని తెలిపింది.
మేమూ రాయల్టీ కడ్తం
విద్యుదుత్పత్తి చేసే సంస్థలు (జెన్కో వంటివి) ఇరిగేషన్ శాఖ నిర్మించిన ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్లను వాడుకుంటున్నాయని, దానికి ఆయా సంస్థలు కేవలం రాయల్టీనే కడుతున్నాయని ఇరిగేషన్ శాఖ వెల్లడించింది. ఉదాహరణకు జెన్కో ఒక టీఎంసీ నీళ్లతో ఒక మెగా యూనిట్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తే.. రూ.వెయ్యి రాయల్టీని ఇరిగేషన్ శాఖకు జెన్కో చెల్లిస్తుందని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే నీటి లిఫ్టింగ్కు ఒక మెగా యూనిట్ కరెంట్ను ఇరిగేషన్ శాఖ వాడుకుంటే.. అంతే మొత్తంలో రాయల్టీని చెల్లించేలా అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే, దానికి అదనంగా ట్రాన్స్మిషన్చార్జీలను ట్రాన్స్కోకు చెల్లించేందుకు సిద్ధమని పేర్కొంది. ఒకవేళ అలా కానిపక్షంలో ఒక యూనిట్ తయారీకి ఎంత ఖర్చవుతుందో అంతే మొత్తంలో చెల్లిస్తామని స్ప ష్టం చేసింది. అదనంగా సరఫరా చార్జీలను భరిస్తామని పేర్కొంది.
