మహబూబాబాద్, వెలుగు: ఓ మహిళతో అసభ్యంగా వ్యవహరించిన కలెక్టరేట్లో పనిచేసే అటెండర్కు ఆమె కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగంలో మురళి అనే వ్యక్తి అటెండర్ గా పనిచేస్తున్నాడు. మహబూబాబాద్ మండలం పర్వతగిరికి చెందిన ఓ మహిళ గ్రామంలో రోడ్డు నిర్మాణంలో కొంత భూమిని కోల్పోయింది.
అప్పటి నుంచి భూ పరిహారం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతోంది. ఆమెను కొంతకాలంగా గమనిస్తున్న మురళి బుధవారం ఆమె కలెక్టరేట్కు రావడంతో అదునుగా చూసి అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో బాధిత మహిళ ఫోన్లో విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో కొద్దిసేపటికి వారు కలెక్టరేట్కు చేరుకొని మురళిని చితకబాదారు. అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మురళిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సదరు మహిళ మీడియాకు తెలిపారు.
