- రాత్రిళ్లు బైక్ రేసులు పెట్టుకుంటున్న యువకులు
- రెండు వారాల్లో మూడు ఘోర ప్రమాదాలు, 9 మంది మృతి
- స్మోకర్లు, డ్రింకర్లకు అడ్డాగా బైపాస్ ఏరియాలు
మహబూబ్నగర్, వెలుగు:మహబూబ్నగర్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్లు డేంజర్ జోన్లుగా మారుతున్నాయి. తరచూ ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. నెల రోజుల్లోనే నగరంలోని రెండు బైపాస్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ఎవరు ఎటు నుంచి వస్తూ పోతున్నరో తెలియని పరిస్థితి..
పాల్కొండ బైపాస్ ఎస్వీఎస్ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రారంభమై మహబూబ్నగర్–భూత్పూర్ రోడ్డుకు కలుస్తుంది. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించింది. అయితే ఈ మార్గంలో లారీలు, జీపులు, కార్లు, ప్రైవేట్ ట్రావెల్స్, బైకులు ఓవర్ స్పీడ్తో వస్తుంటాయి.
ప్రధానంగా పిస్తా హౌస్, ఎదిర క్రాస్ రోడ్డు వద్ద ఏ బండి ఎటు వైపు నుంచి ఎటు వైపు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ రెండు ప్రాంతాల్లో నాలుగు కూడళ్ల రోడ్డు ఉండడంతో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు. బారికేడ్లు ఏర్పాటు చేసినా ఫలితం ఉండడం లేదు. పైగా పిస్తా హౌస్ వద్ద వందల కొద్దీ వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో రాత్రిళ్లు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటేనే స్థానికులు భయపడుతున్నారు.
ఓపెన్ కాక ముందే యాక్సిడెంట్లు
మహబూబ్నగర్–-చించోలి హైవేను కలుపుతూ నగరంలో కొత్తగా బై పాస్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బైపాస్ పనులు ఇంకా పూర్తి కాలేదు. కొంత భాగం మిలిగి ఉంది. అయితే వాహనదారులు మాత్రం ఈ మార్గంలో ప్రయాణాలు చేస్తున్నారు. కర్నాటక, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు.. ఈ మార్గంలో 120 నుంచి 140 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాయి. ఇటీవల ఈ మార్గంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
కొద్ది రోజుల కిందట వీరన్నపేట బైపాస్ నుంచి జీప్ యూ టర్న్ తీసుకుంటుండగా.. అటు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రాంతంలో రెండు వారాల కింద ఆటోను జీపు ఢీకొట్టడంతో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు.
వేగ నియంత్రణ ఏదీ?
తాజాగా పాల్కొండ బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో రేసింగ్ బైక్ మితిమీరిన వేగంతో వచ్చి కారును ఢీకొనడంతో ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. అయితే బైపాస్ల పొంటి వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ లిమిట్ బోర్డులు, స్పీడ్ కెమెరాలు, స్పీడ్ గన్స్, అవసరమైన చోట రంబుల్ ట్రిప్స్ఏర్పాటు చేయాల్సి ఉంది. జంక్షన్లు, కూడళ్ల వద్ద ప్రత్యేక లైట్లు, మలుపులు, గ్రామ ప్రదేశాలు, స్కూల్ జోన్ల వద్ద రిఫ్లెక్టివ్ స్ట్రిక్కర్లు, స్లో డౌన్, యాక్సిడెంట్ జోన్ వంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి కూడలి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి.
రాత్రి ఒంటి గంట వరకు ఓపెన్..
పాలకొండ బైపాస్ పక్కన హోటళ్లు, చాయ్ దుకాణాలు రాత్రి ఒంటి గంట వరకు తెరిచే ఉంటున్నాయి. దీంతో నగరానికి చెందిన యువత పెద్ద మొత్తంలో ఈ ప్రాంతానికి చేరుకొని టైం పాస్ చేస్తున్నారు. రాత్రి 9 దాటాకా.. బైక్లు వేసుకొని బైపాస్ ఎక్కుతున్నారు. సైలెన్సర్ల నుంచి భయంకరమైన శబ్దాలు చేస్తూ బైక్ రేసింగ్లు పెట్టుకుంటున్నారు.
మరికొందరు అక్కడక్కడా ఉన్న కల్వర్టుల వద్ద కూర్చొని సిగరెట్లు తాగుతూ వచ్చి పోయే వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొందరు బైపాస్ వెంట ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లను సిట్టింగుల కోసం వినియోగించుకుంటున్నారు.
గత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేయడం లేదని అంటున్నారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ జరుగుతున్నా నామ్కే వాస్తేగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి.
