
దంతాలపల్లి, వెలుగు: తడిసిన ధాన్యంతో రైతులు రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో పోసి నెల రోజులు గడుస్తున్నా కాంటాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరి కుంట్లలో బుధవారం సూర్యాపేట– -దంతాలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. మ్యాచర్ వచ్చినా హమాలీలు కాంటాలు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీల కొరత ఉందంటూ నిర్వాహకులు దాటవేస్తున్నట్లు, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వడ్లను కొనాలని డిమాండ్ చేశారు.
పోలీసులు వెళ్లి నచ్చ చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. అదేవిధంగా నరసింహులపేట మండలం తిరుమా తండా వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన తహసీల్దార్ రమేష్ బాబు కాళ్లను గిరిజన మహిళా రైతులు పట్టుకోగా.. అలా చేయొద్దని వారించారు. తాము కష్టపడి పండించిన ధాన్యం వానతో తడిసిపోతుందని రైతులు తెలుపడంతో సమస్యను పరిష్కరిస్తామని హామీ తహసీల్దార్ ఇచ్చారు.