- అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ స్కీమ్కు ఎంపిక
- రూ.40 కోట్లతో కొత్త బిల్డింగుల నిర్మాణం
- ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేయాలని డెడ్లైన్
మహబూబ్నగర్, వెలుగు: వందేళ్ల చరిత్ర ఉన్న మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ’ స్కీమ్కు ఈ స్టేషన్ ఎంపికైంది. దీంతో స్టేషన్లో ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. దాదాపు రూ.40 కోట్లతో కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రయణికులకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక భవనాల్లో రైల్వే సేవలు కొనసాగిస్తున్నారు.
రైల్వే టెర్మినల్ పనులు షురూ..
మహబూబ్నగర్ రైల్వే స్టేషన్కు రోజు రోజుకు ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. ఈ స్టేషన్ నుంచి ప్రతి రోజూ 40 నుంచి 50 రైళ్లు వచ్చి పోతుంటాయి. అయితే స్టేషన్కు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ కింద పలు అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పూర్తి చేశారు. ఇటీవల కొత్త భవనాల నిర్మాణాలను ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఎక్సవేటర్లు, లిఫ్ట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. టాయిలెట్స్, రైల్వే శాఖకు సంబంధించిన అన్ని రకాల డిపార్ట్మెంట్ల కోసం ప్రత్యేకంగా రూమ్స్ నిర్మించనున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నారు.
ఎయిర్ పోర్టులో ఉండే టర్మినల్ తరహాలో మహబూబ్నగర్లో రైల్వే టర్మినల్ను నిర్మించనున్నారు. ఈ టర్మినల్లో భాగంగా కాన్ కోర్స్ మాదిరిగా పెద్ద హాల్ నిర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాలకు జర్నీ చేసే ప్రయాణికులు వేచి ఉండేందుకు వెయిటింగ్ హాళ్లు, ఆయా ప్లాట్ ఫామ్ల వద్దకు వెళ్లేందుకు, స్టేషన్ బయటకు వెళ్లేందుకు ఈ కాన్ కోర్స్ హాల్ గుండా మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ హాలులోనే ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కౌంటర్లు, రెస్టారెంట్లు, షాపులు ఏర్పాటు చేస్తారు.
తాత్కాలిక భవనాల్లో సేవలు..
కొత్త బిల్డింగుల నిర్మాణంలో భాగంగా పాత రైల్వే స్టేషన్ భవనాన్ని కూల్చి వేయనున్నారు. ఈ బిల్డింగ్లో ఉన్న టికెట్ కౌంటర్, ఎంక్వైరీ సెంటర్, రిజర్వేషన్ కౌంటర్లను తాత్కాలిక భవనాల్లోకి మార్చారు. రిజర్వేషన్ కౌంటర్ను స్టేషన్ ముందు భాగంలో ఎస్బీఐ ఏటీఎం పక్కన ఉన్న రైల్వే మెయిల్ ఆఫీస్లోకి, టికెట్కౌంటర్, ఎంక్వైరీ సెంటర్లను రైల్వే పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న బిల్డింగ్లోకి షిఫ్ట్ చేశారు. 8 నెలల పాటు ప్రయాణికులకు ఇక్కడి నుంచే సేవలు అందించనున్నారు. అలాగే మోతీనగర్ ప్రాంత వాసులకు ఇబ్బంది కలగకుండా మొదటి ప్లాట్ ఫామ్ నుంచి చివరి ప్లాట్ ఫామ్ వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.
పాలమూరు స్టేషన్కు వందేళ్ల చరిత్ర..
పాలమూరు రైల్వే స్టేషన్కు వందేళ్ల చరిత్ర ఉంది. 1870లో బ్రిటీష్ వారు హైదరాబాద్ నుంచి కర్నాటకలోని రాయచూర్, గుల్బర్గా ప్రాంతాలకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో నిజాం నవాబులు భాగస్వాములై దీనికి నైజాం స్టేట్ రైల్వేస్గా పేరు పెట్టారు. ఇందులో భాగంగా మహబూబ్నగర్లో కూడా కొత్తగా రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 1888లో హైదరాబాద్ నుంచి మీటర్ గేజ్ రైల్వే లైన్ పనులు మొదలు పెట్టి, 1892లో పూర్తి చేశారు. 1922లో మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కు మారడంతో.. నిజాం పాలనలో కట్టిన పాత భవనాన్ని కూల్చివేశారు. 1993లో కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 32 ఏండ్ల తర్వాత తాజాగా ఈ భవనాన్ని కూల్చనున్నారు. దీని స్థానంలో కొత్త భవనాన్ని అందుబాటులోకి రానుంది.
