ముంబై: కరోనాను బాగా కట్టడి చేస్తోందని ప్రచారంలో ఉన్న రెమ్డెసివిర్ డ్రగ్ను మహారాష్ట్ర ప్రభుత్వం ట్రయల్ చేయబోతోంది. ఓ బంగ్లాదేశ్ కంపెనీ నుంచి ఆ రాష్ట్రానికి 3 వేల వియల్స్ రాబోతున్నాయి. మరో 10 వేల వియల్స్ కూడా తీసుకోవాలని ఆ సర్కారు ప్లాన్ చేస్తోంది. బంగ్లా కంపెనీ నుంచి దేశంలోని 18 మెడికల్ కాలేజీలు, మహా సర్కారు ఈ డ్రగ్ను అందుకోబోతున్నాయి. కొవిడ్ పేషెంట్లకు సంబంధించి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ను ఐసీఎంఆర్ మార్పు చేసిన తర్వాత మహా సర్కారు ఈ ప్రయత్నం చేస్తోంది. రెమ్డెసివిర్ను వాడుదామని సీఎం ఉద్ధవ్ థాక్రేకు ‘మహా’ టాస్క్ఫోర్స్ కమిటీ సూచించిందని, అందుకు ఆయన ఓకే చేశారని సమాచారం. పైగా రాష్ట్రంలో ఆ డ్రగ్ తయారీకి ఉన్న అడ్డంకులు తొలగించాలని కూడా వాళ్లు సూచించినట్టు తెలిసింది.
ముంబైలో ఇప్పటికే వాడకం
10 వేల వియల్స్ రెమ్డెసివిర్ను తీసుకుంటున్నామని మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే గత వారం చెప్పారు. కరోనా వైరస్ ద్వారా వ్యాపించే మెర్స్, సార్స్పై ఈ మందు బాగా పని చేసిందని క్లినికల్ ట్రయల్స్ చెబుతున్నాయన్నారు. ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్వో కూడా వెల్లడించిందని గుర్తు చేశారు. రెమ్డెసివిర్ను ముంబైలో ఇప్పటికే వాడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు ఇస్తున్నారు. కానీ ఈ ఖరీదైన మందును డబ్బున్న వాళ్లే కొనుక్కోగలుగుతున్నారు. దిగుమతి, ఉత్పత్తికి సంబంధించి కేంద్రం ఆంక్షలు విధించడంతో పేద వాళ్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆక్సిజన్ అత్యవసరమైన పేషెంట్లకు ఈ మందు బాగా పని చేస్తుందని డాక్టర్లు, సైంటిస్టులు చెబుతున్నారు. సింగపూర్ సర్కారు ఈ మందుకు ఇప్పటికే షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది.
లైసెన్స్ ఉన్నా పర్మిషన్ లేదాయె
అమెరికాకు చెందిన ఈ మందు తయారీకి మన దేశంలోని కొన్ని కంపెనీలు పేటెంట్ లైసెన్స్ పొందాయి. అయితే కేంద్రం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో తయారు చేయలేకపోతున్నాయి. దీనిపై కేంద్రాన్ని మహా సర్కారు ఒత్తిడి చేస్తోంది. ‘రెమ్డెసివిర్ తయారీకి పర్మిషన్ ఇవ్వాలని మొదట్నుంచీ నేను డీసీజీఐని అడుగుతూనే ఉన్నాను. జనం చనిపోతున్నా మీరేందుకు మౌనంగా ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న డ్రగ్స్లో ఇదే బెస్ట్ అని అంటున్నారు. జనాల ప్రాణాలు కాపాడండి’ అని కేంద్రాన్ని కోరుతూ మహారాష్ట్ర మినిస్టర్ జితేంద్ర ట్వీట్ చేశారు.