మటన్ మండీలకు ఎక్కువగా రాకపోకలు
వ్యాపారులు, కాంటాక్ట్స్ కు సోకిన వైరస్
దావత్లతో ఇతర ప్రాంతాలకూ..
హైదరాబాద్, వెలుగు: కరోనా కలకలంలో జియాగూడ హాట్ టాపిక్గా మారింది. గ్రేటర్ లో రోజూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కేసుల్లో జియాగూడ, పరిసర ప్రాంతాల నుంచే ఎక్కువ ఉంటున్నాయి. 20 రోజుల కిందట ఇక్కడ 13 కేసులు రాగా.. 9 కంటెయిన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేసులు 130, జోన్లు 35కి చేరాయి. లాక్ డౌన్కి ముందే.. మార్చిలో మహారాష్ట్ర నుంచి జియాగూడ మటన్ మండీలకు వచ్చిన వ్యాపారుల ద్వారా వైరస్ స్ర్పెడ్ అయిందని అధికారులు భావిస్తున్నారు.
ఎలా వచ్చిందంటే..
జియాగూడ మటన్ దందాకు ఫేమస్. నార్మల్ డేస్లో వేల మంది వచ్చిపోతుంటారు. హోల్సేల్ మార్కెట్ కూడా అవడంతో ఇక్కడి నుంచి మాంసం తీసుకెళ్లి, ఇతర ప్రాంతాల్లోనూ అమ్ముతుంటారు. జియాగూడకు మేకలు, గొర్రెలు పెద్దసంఖ్యలో మహారాష్ట్ర నుంచే వస్తుంటాయి. హైదరాబాద్లో కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేని టైమ్ లో ఆ రాష్ట్రంలో మాత్రం కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మన దగ్గర లాక్డౌన్ పెట్టే వరకూ డైలీ పెద్ద సంఖ్యలో అక్కడి నుంచి మేకలు, గొర్రెల వ్యాపారులు జియాగూడకు వచ్చారు. మటన్ వ్యాపారులు వారికి ప్రైమరీ కాంటాక్ట్స్ గా మారారు. మటన్ అమ్మేవారికి కరోనా సోకడం, ఆ విషయం తెలియక వారు సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో వైరస్ స్పీడ్ గా స్ప్రెడ్ అయ్యింది. ఇటీవల జియాగూడకు చెందిన ఓ మటన్ వ్యాపారి బంధువుల ఇండ్లకు వెళ్లడంతో అతడి నుంచి పహాడీషరీఫ్లో 13, హర్షగూడలో 4, సంతోష్ నగర్లో 2, జియాగూడలో 4, బోరబండలో 4 పాజిటివ్స్ వచ్చాయి. దుర్గానగర్, సాయిదుర్గానగర్, వెంకటేశ్వరనగర్లో మొదలైన కేసులు క్రమంగా ఇందిరానగర్, గంగానగర్, కార్వాన్, సబ్జీ మండి, లంగర్ హౌస్, గుడిమల్కాపూర్, హీరానగర్ ఏరియాకూ విస్తరించాయి.
కంటెయిన్మెంట్ జోన్లలోఎన్ఐఎన్ సర్వే
సిటీలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్పై ఎన్ఐఎన్ రెండ్రోజుల సర్వే శనివారం ప్రారంభమైంది. ఆదిబట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రాలోని కంటెయిన్ మెంట్ జోన్లలో ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ టీమ్స్ పర్యటించాయి. ఒక్కో జోన్ నుంచి 50 చొప్పున 250 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించాయి. మియాపూర్ డివిజన్ పరిధిలో సాయినగర్, ఓల్డ్ హఫీజ్పేటలో కంటెయిన్మెంట్ జోన్లను తొలగించినా వైరస్ ఎలా స్ప్రెడ్ అయిందన్నది తెలుసుకునేందుకు ర్యాండమ్గా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వాటికి సిటీలోని ఎన్ఐఎన్లో సీరమ్ టెస్ట్ చేయనున్నారు.
పెరుగుతున్న కేసులు
హైదరాబాద్ లో నెల కిందటి వరకు కరోనాకు చార్మినార్ జోన్ కేంద్రంగా ఉంది. ఆ తర్వాత ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జియాగూడ సమస్యాత్మక ప్రాంతంగా మారింది. మార్చిలో చార్మినార్ జోన్ లో వైరస్ తీవ్రత ఎక్కువు న్నప్పుడు జియాగూడలో ఈ స్థాయిలో కేసుల్లేవు. ఈ నెల స్టార్టింగ్ నుంచే ఇక్కడ పాజిటివ్ లు మొదలయ్యాయి. సిటీలోని వివిధ ప్రాంతాల్లోని కేసులకూ జియాగూడ లింక్ ఉంటోంది. జియాగూడకు గుడిమల్కాపూర్ మార్కెట్ దగ్గరగా ఉండటం, మలక్ పేట మార్కెట్ కి ఇటుగా ఎక్కువగా రాకపోకలు, మటన్, సబ్జీ మండీలు, దావత్లు లాంటి యాక్టివిటీస్ కేసులు పెరగడానికి కారణమని అధికారులు చెప్తున్నారు.