మరో ఒమిక్రాన్ కేసు .. భారత్ లో నాలుగుకు చేరిన కేసులు

మరో ఒమిక్రాన్ కేసు .. భారత్ లో నాలుగుకు చేరిన కేసులు

దేశంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. మహారాష్ట్రలో 33 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. అతను  ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా ముంబై వచ్చినట్లు చెప్పారు. అతను కళ్యాణ్-డోంబివాలి మునిసిపల్ ఏరియాలో నివసిస్తున్నాడని తెలిపారు. 12 మంది ప్రైమరీ కాంటాక్ట్స్, 23 మంది సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ఆరోగ్య శాఖ  అధికారులు. మరో 25 మంది తోటి ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా అందరికి నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే అతను ఇంత వరకు ఎలాంటి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని గుర్తించారు. మహారాష్ట్రలో ఇది మొదటి కేసు కాగా..దేశంలో నాల్గో ఒమిక్రాన్ కేసు. ఇప్పటి వరకు  మహారాష్ట్రలో 1, గుజరాత్ జామ్ నగర్ లో 1, కర్ణాటకలో 2 కేసులు  నమోయ్యాయి.

సౌతాఫ్రికాతో పాటు ఇతర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలకు ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ రోజురోజుకు ఒమిక్రాన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టుల్లో విస్తృత పరీక్షలు చేస్తున్నారు.. లక్షణాలు ఉంటే క్వారంటైన్ లో ఉంచి.. జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్ కు పంపుతున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో ఒమిక్రాన్ అనుమానిత కేసులు 12కు చేరాయి. వీళ్లందరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు.