
బీజేపీకి ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ మద్దతు
ఊహించని దెబ్బకు ఎన్సీపీ సేన, కాంగ్రెస్కు షాక్
30లోగా అసెంబ్లీలో బలనిరూపణ
అజిత్ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఎన్సీపీ
అజిత్తో వెళ్లిన ఎమ్మెల్యేలు మళ్లీ శరద్ పవార్ వద్దకు
సేన కూటమి ఎమ్మెల్యేలు క్యాంపులకు
శుక్రవారం రాత్రి వరకు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే. కానీ రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. పార్టీ మారింది. సీఎం అభ్యర్థి మారారు. సీఎం ప్రమాణస్వీకారం కూడా జరిగిపోయింది. హడావుడేం లేదు.. అంతా సైలెంట్గా అయిపోయింది. సరైన టైమ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. అధికారం దక్కించుకోవాలని భావించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్.. బీజేపీ వ్యూహం ముందు నిలవలేకపోయాయి. చర్చల్లో జరిగిన ఆలస్యమే కూటమి కొంపముంచిందని ఆయా పార్టీల నేతలే వాపోతున్నారు.
న్యూఢిల్లీ : నెల రోజులపాటు ఊహకందని విధంగా సాగిన మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీదే పైచేయి అయ్యింది. దేవేంద్ర ఫడ్నవీస్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్న హైవోల్టేజ్ పొలిటికల్ డ్రామాతో మొత్తం సీన్ మారిపోయింది. ఎన్సీపీ ఎల్పీ లీడర్ హోదాలో అజిత్ పవార్ 54 మంది ఎమ్మెల్యేల లిస్ట్ని గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి అందజేశారు. దాంతో ప్రెసిడెంట్ రూల్ ఎత్తివేయాల్సిందిగా గవర్నర్ కోరడంతో… ఆ మేరకు తెల్లవారుజామున 5.47 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాజ్యాంగపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా గవర్నర్ కోషియారీ అన్ని జాగ్రత్తలు తీసుకుని దేవేంద్ర ఫడ్నవీస్ను ఆహ్వానించారు.
ఎన్సీపీ ఎమ్మెల్యేలు తొమ్మిది మందితో కలిసి అజిత్ పవార్కూడా రాజ్భవన్కు వెళ్లారు. వీరిద్దరితో ప్రమాణం చేయించి, ఈ నెల 30న అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవలసిందిగా గవర్నర్ ఆదేశించారు. ఇదిలా ఉంటే, అజిత్ పవార్ తమను మోసగించి రాజ్భవన్కు తీసుకెళ్లారని ఎన్సీపీ ఎమ్మెల్యేలు తొమ్మిదిమంది ఎదురు తిరిగారు. పార్టీ చీఫ్ శరద్ పవార్ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ… అజిత్ నిర్ణయం అతని సొంతమేనని, పార్టీతో సంబంధం లేదని చెప్పారు. శాసనసభా పక్ష నాయకుడిగా అజిత్ను తొలగించి, అతని స్థానంలో దిలీప్ పాటిల్ను నియమించినట్లు ప్రకటించారు. అజిత్ పవార్ తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నందున ఎన్సీపీలో చీలిక ఖాయంగా కనబడుతోంది.
కావాల్సింది కిచిడీ సర్కారు కాదు..
మహారాష్ట్రలో ‘కిచిడీ’ సర్కారు కాకుండా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు మా కూటమికి
స్పష్టమైన మెజారిటీ ఇచ్చినా, శివసేన ఇతర పార్టీలతో కలిసి కిచిడీ సర్కారు స్థాపించేందుకు యత్నించింది. – మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
బీజేపీతో చేతులు కలపాలన్న అజిత్ నిర్ణయం క్రమశిక్షణను వదిలేయడమే. ఆ నిర్ణయంతో నాకు సంబంధంలేదు. బలనిరూపణలో బీజేపీకి ఓటమి తప్పదు. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. – ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
అధికారం అనే సీటులో ఫెవికాల్ పూసుకుని కూర్చోండి. ప్రజాస్వామ్యం పేరుతో ఇలా పిల్లల ఆట ఆడటం హాస్యాస్పదం.
మహారాష్ర్టపై చేసిన సర్జికల్ స్ర్టైక్స్ ఇవి. – శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే
శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు
రాత్రి 11:45 గంటలకు– అజిత్ పవార్, బీజేపీ మధ్య డీల్ ఫైనల్.
11:55– ప్రమాణస్వీకారానికి అనుమతివ్వాలని పార్టీ హైకమాండ్కు ఫడ్నవీస్ రిక్వెస్ట్.
అర్ధరాత్రి12:30– ఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేసుకున్న గవర్నర్.
శనివారం వేకువజాము2:10 – 5:47 గంటలకు రివొకేషన్ ఆర్డర్ను సబ్మిట్ చేయాలని, 7:50 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయాలని సెక్రటరీకి గవర్నర్ ఆదేశాలు.
5:30 – రాజ్భవన్కు చేరుకున్న ఫడ్నవీస్, అజిత్ పవార్.
5:47 – మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తొలగింపు. (అధికారికంగా అనౌన్స్ చేసింది ఉదయం 9గంటలకు).
7:50– ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం.
8:40 – ఫడ్నవీస్, అజిత్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.