తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. అయితే అగ్ర నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయ అరంగేట్రంలోనే ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం పొంతన లేకపోవడంతో విజయ్పై చట్టపరమైన చర్యలు తప్పవా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.
అసలేం జరిగింది?
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. అయితే, ఈ రెండు చోట్ల దాఖలు చేసిన అఫిడవిట్లలో క్రిమినల్ కేసుల ప్రస్తావన పరస్పర విరుద్ధంగా ఉండటం సంచలనం సృష్టిస్తోంది. మార్చి 30న పెరంబూర్ అఫిడవిట్ లో దాఖలు చేసిన డాక్యుమెంట్లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని విజయ్ పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత తిరుచ్చి ఈస్ట్ లో దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం తనపై రెండు ఎఫ్ఐఆర్లు (FIRs) పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు..
చిక్కుల్లో 'దళపతి'?
మధురైలోని కూడ కోవిల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, చెన్నైలోని పెరవల్లూరు పోలీస్ స్టేషన్లో మరొక కేసు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. ఒకచోట కేసుల్లేవని, మరోచోట ఉన్నాయని చెప్పడం విజయ్ను ఇరకాటంలో పడేసింది.ఎన్నికల నియమావళి ప్రకారం, అఫిడవిట్లో నిజాలను దాచడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, 1951 (సెక్షన్ 125A) ప్రకారం నేరం. దీనికి ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే విజయ్ నామినేషన్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్లు
విజయ్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 603.20 కోట్లు. ఇందులో వివిధ బ్యాంకుల్లో రూ. 213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఆయన గ్యారేజీలో BMW 530, టయోటా లెక్సస్, టయోటా వెల్ఫైర్, మరియు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ BMW i7 వంటి వాహనాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే విజయ్ తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్, తల్లి శోభలకు రూ. 12 కోట్లు, భార్య సంగీత, పిల్లలకు కలిపి సుమారు రూ. 29 కోట్ల వరకు అప్పులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఆయన భార్య సంగీత విడిగా రూ. 15.76 కోట్ల ఆస్తులను ప్రకటించారు. కాగా, గత నెలలోనే ఆమె విజయ్ నుండి విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
పార్టీలో మరో కుబేరుడు
TVK పార్టీలో విజయ్ తర్వాత అత్యధిక ఆస్తులున్న నేతగా ఆదవ్ అర్జున నిలిచారు. విల్లివాక్కం నుంచి పోటీ చేస్తున్న ఆయన, తన భార్యతో కలిపి సుమారు రూ. 445 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు రానున్నాయి. మరి ఈ 'అఫిడవిట్' గండం నుండి విజయ్ ఎలా గట్టెక్కుతారో చూడాలి!
