- ఇప్పటికే జమ్మూకాశ్మీర్లో మకాం వేసిన టెర్రరిస్టులు
- ఎల్వోసీ వెంట మరికొంత మంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్
శ్రీనగర్: కాశ్మీర్ వ్యాలీ, జమ్మూలో ఈ నెల 26 రిపబ్లిక్డే రోజు దాడులు చేసేందుకు టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. ఇప్పటికే 8 మంది టెర్రరిస్టులు పుల్వామా తదితర ప్రాంతాలకు చేరుకున్నారని వెల్లడించాయి. పుల్వామాకు చెందిన లష్కరే తోయిబా లీడర్ జాహిద్ నజీర్ భట్ జమ్మూ ఏరియాలోని నర్వాల్లో మరో నలుగురు టెర్రరిస్టులతో కలిసి ఉంటున్నట్టు, భారీ టెర్రర్ ఎటాక్కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందిందని అధికారులు చెప్పారు. జైషే మహ్మద్ టెర్రర్ సంస్థ కూడా భారీ ఎటాక్స్కు ప్లాన్ చేస్తోందని, ఈ మేరకు ఆ సంస్థ లోకల్ కమాండర్ జాహిద్ మన్జూర్ వనీ, మరికొందరు లోకల్ టెర్రరిస్టులు శ్రీనగర్లోని రాజ్పొరా ఏరియాలో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. వివిధ టెర్రరిస్టుల గ్రూపులకు చెందిన 8 మంది టెర్రరిస్టులు ఆర్మీ క్యాంపులు, ఎల్వోసీ వెంట దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రిపోర్ట్లో చెప్పారు. హిజ్బుల్ ముజాహుద్దిన్, మరికొన్ని లోకల్ టెర్రరిస్టు గ్రూపులు కాశ్మీర్, పుల్వామా, తదితర ప్రాంతాల్లోని పంచాయతీ ఆఫీసులు, లింక్ రోడ్ల దగ్గర ఎల్ఈడీ ఎటాక్స్కు ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. హిజ్బుల్ ముజాహుద్దిన్ టెర్రర్ గ్రూప్ కాశ్మీర్ వ్యాలీకి చెందిన చాలా మందిని రిక్రూట్ చేసుకుంటోందని తెలుస్తోంది. ఎల్వోసీ దగ్గర కూడా చాలా మంది టెర్రరిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్లోని ఆర్మీ, సెక్యూరిటీ ఫోర్స్ను కేంద్ర హోంశాఖ ఎలర్ట్ చేసింది.