
గాజా/టెల్ అవీవ్: గాజాలో హమాస్తో డీల్ కుదుర్చుకోవాలని, బందీలను వెనక్కి తెచ్చుకోవాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ కు సూచించారు. ఈమేరకు ఆయన ఆదివారం ఉదయం తన ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇరవై నెలల యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. గాజా అంశంపై తాము దృష్టి పెట్టామని, వారం రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉంటుందని గత శుక్రవారం (జూన్ 27) ట్రంప్ మీడియా ముందు చెప్పారు.
తాజాగా డీల్ కుదుర్చుకుని, బందీలను తెచ్చుకోవాలంటూ ఆయన పోస్ట్ చేయడంతో హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం దిశగా కదలిక వచ్చినట్టుగా భావిస్తున్నారు. అలాగే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై సొంత దేశంలో అవినీతి ఆరోపణలపై విచారణకు లీగల్ ప్రొసీడింగ్స్పై ట్రంప్ విమర్శలు గుప్పించారు.
రాజకీయంగా నెతన్యాహును బలి చేసేందుకే ఈ విచారణను తెరపైకి తెచ్చారన్నారు. ఏమీ లేని విషయానికి ప్రధాన మంత్రిని రోజంతా కోర్టు హాల్లో విచారణకు కూర్చోబెడితే.. హమాస్తో డీల్, బందీల విడుదల ఎలా సాధ్యమని ఆయన తాజా పోస్టులో ప్రశ్నించారు. కాగా, గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటే బందీలందరినీ విడిచిపెడతామని చెప్పినా ఇజ్రాయెల్ ఒప్పుకోవడంలేదని హమాస్ చెప్తుండగా.. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అడ్డు పడుతోందని ఇజ్రాయెల్ ఇప్పటివరకూ ఆరోపిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు త్వరలోనే వాషింగ్టన్కు వెళ్లనున్నారని, హమాస్తో యుద్ధం ముగింపు కోసం కొత్త డీల్ కుదిరే అవకాశాలు ఉన్నాయని ఇజ్రాయెలీ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
హమాస్ చెరలో ఇంకా 50 మంది..
2023 అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ పై దాడి చేసి 1200 మందిని చంపి, 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. హమాస్ చెరలో ఇంకా 50 మంది బందీలు ఉన్నారు. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 56 వేల మంది చనిపోయారని అంచనా.