సంగారెడ్డిలో సత్తా చాటండి.. బీజేపీ క్యాడర్​కు బండి సంజయ్ పిలుపు

సంగారెడ్డిలో సత్తా చాటండి.. బీజేపీ క్యాడర్​కు బండి సంజయ్ పిలుపు

హైదరాబాద్,వెలుగు: సంగారెడ్డి పట్టణంలో గురువా రం నిర్వహించే నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేసి సత్తా చాటాలని పార్టీ క్యాడర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌజ్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, నేతలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు, టి.వీరేందర్ గౌడ్, ఆకుల విజయ, దరువు ఎల్లన్న, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అనాలోచిత విధానాలతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో పాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా బీజేపీకే ఉందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేశారని, సంగారెడ్డి జిల్లాలో చేపట్టే నిరుద్యోగ మార్చ్ ను కూడా సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.