- తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష ఎండీపీ సిద్ధం
- ఇతర పార్టీల ఎంపీల సంతకాల సేకరణ షురూ
మాలె: మాల్దీవుల పార్లమెంట్లో మెజారిటీ సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) ఆ దేశ అధ్యక్షుడు మొహ్మద్ మొయిజ్జుపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఇందుకోసం ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యుల నుంచి కూడా సంతకాలు సేకరిస్తున్నట్లు మాల్దీవ్స్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోమవారం జరిగిన ఎండీపీ పార్లమెంటరీ గ్రూప్ సమావేశంలో అభిశంసన తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ఎంపీలు చెప్తున్నారు. మాల్దీవ్స్ రాజ్యాంగం, పార్లమెంటు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం పార్లమెంటులో 56 ఓట్లు వస్తే అధ్యక్షుడిని అభిశంసించవచ్చు.
మాల్దీవ్స్ పార్లమెంటులో మొత్తం 80 మంది సభ్యులు ఉన్నారు. ఎండీపీకి 45 మంది, దాని మిత్రపక్షమైన డెమోక్రాట్స్ (డీఈఎం)కు 13 మంది సభ్యులు ఉన్నారు. అధికార కూటమిలోని ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్(పీపీఎం)కు ఇద్దరు, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(పీఎంసీ)కు 13 మంది సభ్యులు ఉన్నారు. నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా మొయిజ్జు ప్రమాణం చేసిన వెంటనే.. మార్చి 15లోగా తన దేశం నుంచి సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ఇండియాకు సూచించారు. అయితే జనవరి 24న మాల్దీవ్స్ ప్రతిపక్షాలు ఇండియాను ‘‘అత్యంత దీర్ఘకాల మిత్రదేశం’’గా పేర్కొన్నాయి. అలాగే ఎండీపీ, డెమొక్రాట్లు.. మొయిజ్జు ప్రభుత్వం అనుసరిస్తున్న ‘‘ఇండియా వ్యతిరేక వైఖరి’’ పై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా పరిశోధక నౌకను మాల్దీవ్స్ పోర్ట్ లోకి అనుమతివ్వడంపై కూడా వ్యతిరేకత వస్తున్నది..