కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట

30 వేల మందికి పైగా రాకతో సందడి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తుల రాకతో సందడిగా మారింది. ఆదివారం ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. మల్లికార్జునస్వామిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం సాయత్రం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయ, ప్రయివేటు వసతి గదులలో బసచేశారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు.  అభిషేకాలు, పట్నాలు, ఒడిబియ్యం, అర్చనలు, కేశఖండన, గంగరేణి చెట్టుకు ముడుపులు కట్టి, బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు.

మల్లికార్జున స్వామి దర్శనంకు సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టింది. మల్లికార్జునస్వామి కవి అందెశ్రీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అందెశ్రీకి స్వామి లడ్డు ప్రసాదం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.  మల్లికార్జునస్వామి ఆలయంలోని నిత్యాన్నదాన సత్రంకు హందిపూర్ కు చెందిన భక్తులు చందా రాజిరెడ్డి, లత దంపతులు రూ.50,116లు ఆలయానికి విరాళంగా అందించారు.

కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యాలను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. నాచారం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం  ఈఓగా విశ్వనాథ్ శర్మ పదవి విరమణ సందర్భంగా మల్లికార్జున స్వామి వారి దేవాలయ అర్చక బృందం సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్, బసవేశ్వర్, రేవన సిద్దేశ్వర్, లింగ వీరేశంతో పాటు పలువురు కలిసి విశ్వనాథ్ శర్మ దంపతులను సన్మానించారు.