హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో సెక్రటేరియెట్ ఓ జైలులాగా ఉండేదని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో రోజూ వందలాది మంది సెక్రటేరియెట్కు వస్తున్నారని చెప్పారు. శనివారం ఆయన సెక్రటేరియెట్ మీడియా సెంటర్లో మాట్లాడారు. ప్రభుత్వాన్ని రోజూ తిట్టినంత మాత్రాన కేటీఆర్ పెద్ద లీడర్ అవుతారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
ఫెవికాల్ బంధం బీజేపీ, కాంగ్రెస్ది కాదని, బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఫెవికాల్ బంధం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఓట్లు పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫర్ అయ్యాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న బంధం వల్లనే కవితను అరెస్ట్ చేయలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, కవిత కేసులను ఒప్పందంలో భాగంగానే నిర్వీర్యం చేశారన్నారు. 2018 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.
పులి వస్తున్నదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా ఎవరు ఆపారని నిలదీశారు. అడవిలోని జంతువుల స్వేచ్ఛను పులి హరించినట్టే.. కేసీఆర్ ప్రజల స్వేచ్ఛను హరించారన్నారు. బీఆర్ఎస్ అధికారం పోయాక.. ఆ పార్టీలో ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు.