కోల్కతా: బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో మమతా బెనర్జీ సర్కారుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ (ఎస్ఎల్ఎస్టీ) చట్టబద్ధం కాదని జస్టిస్ దేబాంగ్సు బాసక్, జస్టిస్ ఎండీ షబ్బార్రషీదిలతోకూడిన బెంచ్ తీర్పు చెప్పింది.
ఎస్ఎల్ఎస్టీ 2016 ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ రద్దు చేయాలని, దీని కింద ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది తాము తీసుకున్న జీతాలను 4 వారాల్లో వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని ఆదేశించింది. కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)కి ఆదేశాలు జారీచేసింది. నియామక ప్రక్రియపై తదుపరి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. కాగా, ఈ ఉత్తర్వుపై స్టే విధించాలని కొంతమంది చేసుకున్న అభ్యర్థనను బెంచ్ తిరస్కరించింది.
రిక్రూట్మెంట్లో అవకతవకలపై పిటిషన్లు
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 9 నుంచి 12 వ తరగతులకు ఉపాధ్యాయులు, గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీకి బెంగాల్ సర్కారు 2016లో ఎస్ఎల్ఎస్టీ ద్వారా నియామక పరీక్ష నిర్వహించింది. మొత్తం 24,640 ఖాళీలుండగా, 23 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ నిర్వహించి 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. కాగా, ఈ రిక్రూట్మెంట్ టెస్ట్లో అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణకు డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన బెంచ్.. చివరకు 2016 టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అది చెల్లదని తీర్పుచెప్పింది. ఈ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది జీతాల రికవరీ బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.
ఉద్యోగాల రద్దు చట్టవిరుద్ధం: సీఎం మమతా బెనర్జీ
బెంగాల్లో 2016 టీచర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేసిన ఉద్యోగాలను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఉద్యోగాల రద్దు చట్ట విరుద్ధమన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. నార్త్ బెంగాల్లోని రాయ్గంజ్, కరన్డిఘిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె, మాట్లాడారు. కొన్ని న్యాయ నిర్ణయాలను బీజేపీ నేతలు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని, తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ‘అన్ని తీర్పులను అంగీకరించడం తప్పనిసరేం కాదు. హైకోర్టు ఆర్డర్స్ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం’ అని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.