నమ్మిన వ్యక్తి మోసం చేశాడని ..పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం

నమ్మిన వ్యక్తి మోసం చేశాడని ..పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం

కూకట్​పల్లి, వెలుగు: నమ్మిన వ్యక్తే తనను మోసం చేయడంతో ఓ యువకుడు పీఎస్​ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని భీమవరానికి చెందిన ఆనంద్​వరప్రసాద్​(28) ఆర్టీసీ క్రాస్​రోడ్స్​లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్నాడు. ఈయనకు ఇటీవల ఢిల్లీ నుంచి నగరానికి వస్తుండగా ట్రైన్​లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. 

ఆ వ్యక్తిని ఆనంద్​ డబ్బు సాయం కోరాడు. వీరిద్దరు కారులో పెద్ద అంబర్​పేటకు వెళ్లారు. ఆనంద్​ను కారులో ఉంచిన సదరు వ్యక్తి, కూకట్​పల్లిలో నివసించే ఆనంద్​ అక్కకు ఫోన్​ చేసి కానిస్టేబుల్​గా పరిచయం చేసుకున్నాడు. నీ తమ్ముడు ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడని, అరెస్టు చేయకుండా ఉండాలంటే డబ్బు కావాలని డిమాండ్​ చేశాడు. దీంతో ఆమె ఆనంద్​ ఖాతాకు రెండు దఫాలుగా రూ.లక్షా 34 వేలు పంపింది. 

ఆ మొత్తాన్ని ఆనంద్​ ఏటీఎం నుంచి సదరు వ్యక్తి తీసుకుని పారిపోయాడు. దీంతో కూకట్​పల్లి పోలీసులకు ఆనంద్​ ఫిర్యాదు చేశాడు. శుక్రవారం కేసు నమోదు చేసి సైఫాబాద్​కు బదిలీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పీఎస్​ నుంచి బయటకు వచ్చిన ఆనంద్​ ఎలుకల మందు తాగాడు. పోలీసులు సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతున్నాడు