10 రూపాయల కోసం ఫ్రెండ్‌పై పెట్రోల్ పోసి నిప్పు: పట్టించిన సీసీ కెమెరా ఫుటేజీ

10 రూపాయల కోసం ఫ్రెండ్‌పై పెట్రోల్ పోసి నిప్పు: పట్టించిన సీసీ కెమెరా ఫుటేజీ

కేవలం పది రూపాయల కోసం మొదలైన గొడవ.. స్నేహితుడి ప్రాణం తీసేదాక పోయింది. ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించారు ఇద్దరు ఫ్రెండ్స్. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో జరిగింది.

గత శనివారం (ఫిబ్రవరి 22న) ఉజ్జయినిలోని ననఖేడ ప్రాంతంలో సురాజ్, శుభమ్, గణేశ్ అనే ముగ్గురు స్నేహితుల మధ్య చిన్న విషయంలో గొడవ పెద్దదిగా మారింది. గణేశ్‌ను మిగిలిన ఇద్దరు రూ.10 ఇవ్వాలని అడిగారు. అతడు ఇవ్వలేనని చెప్పడంతో పోట్లాట మొదలైంది. ఇద్దరూ కలిసి డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ గణేశ్‌పై కలబడ్డారు. అతడు ససేమిరా అనడంతో సురాజ్, శుభమ్ ఇద్దరూ కలిసి పెట్రోల్ పోసి.. అగ్గిపుల్ల గీసి విసిరి పరారయ్యారు. క్షణాల గ్యాప్‌లో గణేశ్ ఒళ్లంతా మంటలు అంటుకుని, తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు ప్రాథమిక చికిత్స తర్వాత ఇండోర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన గణేశ్.. చివరికి నిన్న ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఈ దారుణానికి పాల్పడింది గణేశ్ స్నేహితులేనని గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉన్న సెక్యూరిటీ కెమెరాల్లో వాళ్లు గొడవ పడడం, ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టడం మొత్తం రికార్డ్ అయిందని, దీని ఆధారంగా వారిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ గొడవ పెట్టుకోవడానికి రూ.10 అడిగితే ఇవ్వకపోవడమేనని ఎంక్వైరీలో వాళ్లు చెప్పారని, అన్నీ ఆధారాలు పక్కాగా ఉన్నాయని, వాటి సాయంతో శిక్ష పడేలా చేస్తామని అన్నారు.