అవమానించారని..భార్యా పిల్లలను చంపి తానూ ఆత్మహత్య

అవమానించారని..భార్యా పిల్లలను చంపి తానూ ఆత్మహత్య


మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారంలో దారుణం
తమ అమ్మాయిని వేధించాడని ఆటో డ్రైవర్ భిక్షపతిపై కొందరి దాడి
 తాను ఏ తప్పు చేయలేదని 
చెప్పినా వినలేదని ఆవేదన‌
 ముందు భార్యాపిల్లల హత్య.. తర్వాత తానూ సూసైడ్
 సూసైడ్ నోట్‌ ఆధారంగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చేయని తప్పుకు తనపై దాడి చేశారని మనస్తాపానికి గురైన ఆటోడ్రైవర్ భార్యాపిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌‌‌‌ జిల్లా కీసర మండలం నాగారంలో ఈ దారుణం శుక్రవారం జరిగింది. ఘటనా స్థలంలో కీసర పోలీసులు రెండు పేజీల సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్‌‌‌‌ 306, 302 కింద కేసు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటిపై దాడి..
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంటకు చెందిన పల్లపు భిక్షపతి (36) ఆరు నెలల క్రితం నాగారం వచ్చాడు. భార్య ఉష (28), పిల్లలు హర్షిత (11), యశ్వంత్‌‌‌‌ (7)తో కలిసి వెస్ట్‌‌‌‌ గాంధీనగర్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. కిరాయి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ కావడంతో గురువారం మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఒర్సు రమేశ్‌‌‌‌ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి భిక్షపతి ఇంటిపై దాడి చేశాడు. తమ కూతురిని వేధించాడంటూ భిక్షపతిని తీవ్రంగా కొట్టారు. తను ఎలాంటి తప్పు చేయలేదని భిక్షపతి చెప్పినా వినిపించుకోలేదు. స్థానికులు అడ్డుకోవడంతో శుక్రవారం పెద్దల సమక్షంలో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
మరోసారి దాడి చేయడంతో..
శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో భిక్షపతిపై ఒర్సు రమేశ్‌‌‌‌ తోపాటు మరికొంత మంది మరోసారి దాడి చేశారు. ఈ క్రమంలో భిక్షపతి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. చేయని తప్పుకు తనపై దాడి చేశారని అవమానంగా భావించాడు. ముందు భార్యాపిల్లలను చంపి.. తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భిక్షపతి ఫ్యాన్‌‌‌‌కి ఉరి వేసుకోగా.. భార్య ఉష, పిల్లలు హర్షిత, యశ్వంత్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీలు బెడ్‌‌‌‌పై పడి ఉన్నాయి. సూసైడ్ నోట్ రాసిన భిక్షపతి.. ఒర్సు రమేశ్‌‌‌‌ కుటుంబంతోపాటు మరికొంత మంది పేర్లను అందులో పేర్కొన్నాడు. భిక్షపతి అన్నయ్య కనకయ్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యుల స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేశారు. ఒర్సు రమేశ్‌‌‌‌తోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తప్పు చేయకున్నా కొట్టిన్రు
“రాత్రి 9.30కి మా తమ్ముడు ఫోన్‌‌‌‌ చేసిండు. తను ఎవ్వరినీ వేధించకున్నా కొందరు తమ ఇంటిపై దాడి చేసి కొట్టారని చెప్పాడు. పొద్దున వచ్చి మాట్లాడతామని చెప్పాను. పొద్దున ఫోన్‌‌‌‌ చేసిండు. మళ్లీ వచ్చి కొట్టారని చెప్పిండు. మా తమ్ముడికీ ఓ కూతురు ఉంది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా పట్టించుకోకుండా కొట్టారు. 15 మంది దాకా దాడి చేసినట్లు మా తమ్ముడు చెప్పిండు. నలుగురిని వాళ్లే చంపిన్రు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలి’’                      - లక్ష్మి, మృతుడి అక్క