బైక్‌పై తీసుకెళ్తున్న సిలిండర్ పేలి వ్యక్తి మృతి

బైక్‌పై తీసుకెళ్తున్న సిలిండర్ పేలి వ్యక్తి మృతి

బైక్‌పై తీసుకెళ్తున్న సిలిండర్ పేలి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. కరీంనగర్‌కు చెందిన సలీం పాషా (21), రాంనగర్‌కు చెందిన మహ్మద్ సమీర్ (20)తో ఉంటున్నాడు. వీరిద్దరూ ఓ ఏసీ కంపెనీలో ఏసీ టెక్నిషియన్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ బుధవారం బాలానగర్‌లోని ఓ ఏసీ సర్వీసింగ్ చేయడానికి ఏసీలలో వాడే గ్యాస్ సిలిండర్‌ను బైక్ మీద తీసుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి బాలానగర్ రోడ్డులోని మారుతి నెక్సెస్ షోరూం వద్దకు చేరుకోగానే బైక్ మీదున్న సిలిండర్ ఒక్కసారిగా పేలింది . ఈ ఘటనలో వెనకాల సిలిండర్ పట్టుకుని కూర్చున్న సలీం పాషా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ నడిపిస్తున్న మహ్మద్ సమీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న బోయినపల్లి పోలీసులు.. మృతిచెందిన సలీం పాషాను పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. గాయాలపాలైన మహ్మద్ సమీర్‌ను కూడా చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.