అప్పటి వరకూ ఒకే రూమ్లో కలిసి మెలిసి ఉన్న స్నేహితుల మధ్య గొడవ అయింది. మాటామాటా పెరిగి కొట్లాట వరకూ వెళ్లింది. ఆవేశంలో చేతికి అందిన చిక్కిన పదునైన వస్తువుతో తలలో పొడవడంతో రూమ్మేట్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. ఆ క్రైమ్ నుంచి ఎలానైనా తప్పించుకోవాలని అనుకున్నాడు. డెడ్బాడీని తీసుకెళ్లి రూమ్కు కొంత దూరంగా ఉన్న ఓపెన్ ప్లాట్లో పడేశాడు. రూమ్లో పడిన రక్తపు మరకలన్నీ తుడిచేసి ఏం జరగనట్టు పడుకున్నాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
నాగ్పూర్లోని ఓ కార్ గ్యారేజ్లో 26 ఏండ్ల దేవాన్ష్ వాఘోడె, రాజు నందేశ్వర్ (35) మెకానిక్లుగా పని చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి డాభా ఏరియాలో రూమ్ తీసుకుని అద్దెకు ఉంటున్నారు. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి, కొట్లాటకు దారితీసింది. ఈ సమయంలో ఉద్రేకంలో దేవాన్ష్ పదునైన వస్తువుతో నందేశ్వర్ను తలపై పొడిచాడు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అనుకోకుండా జరిగిపోయిన క్రైమ్ను కప్పిపుచ్చాలని దేవాన్ష్ అనుకున్నాడు. దీంతో డెడ్బాడీని దూరంగా ప్లాట్లో పడేశాడు. ఆ తర్వాత రూమ్కు వచ్చి బ్లడ్ తుడిచి సైలెంట్గా పడుకున్నాడు. అయితే ఆదివారం ఉదయం ఆ ప్లాట్లో డెడ్బాడీని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం రాత్రికి నిందితుడు దేవాన్ష్ను అరెస్టు చేశారు. అతడిని విచారించగా ముందు రోజు రాత్రి రూమ్లో జరిగిందంతా చెప్పేశాడని పోలీసులు తెలిపారు.