- ముంబై నుంచి అలహాబాద్కు మార్కెట్కు
అలహాబాద్: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షడన్ లాక్డౌన్ వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ లేకపోవడంతో సొంత ఊళ్లకు వెళ్లేది లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ముంబై ఎయిర్పోర్ట్లో పనిచేసే ఒక వ్యక్తి మాత్రం తెలివిగా ఆలోచించి సొంత ఊరికి చేరుకున్నాడు. తను కూరగాయాల వ్యాపారం చేస్తానని, సరుకు తీసుకెళ్తున్నానని చెప్పి ముంబై నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణించి అలహాబాద్లోని సొంత ఊరికి చేరుకున్నాడు. ముంబై ఎయిర్పోర్ట్లో పనిచేసే ప్రేమ్ మూర్తి అనే వ్యక్తి అంధేరీ ఈస్ట్లోని ఆజాదీ నగర్లో ఉంటున్నాడు. అక్కడ వీధులు ఇరుకుగా ఉండటంతో వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో సొంత ఊరికి వెళ్లాలని అనుకున్నాడు. ట్రైన్లు, బస్సులు లేకపోవడంతో ఒక ప్లాన్ వేశాడు. 25 టన్నుల ఉల్లిపాయలు కొని లారీని అద్దెకు తీసుకుని బయలుదేరాడు. “ ప్రభుత్వం ఇప్పట్లో లాక్డౌన్ ఎత్తేలా అనిపించలేదు. కూరగాయలు, పండ్ల వ్యాపారులకు అనుమతిస్తుందని తెలిసి ప్లాన్ వేసుకున్నాను. ముందు పుచ్చకాయలు కొన్నాను. వాటిని అమ్మిన డబ్బులతో 25 టన్నుల ఉల్లిపాయలు కొని లారీ మాట్లాడుకుని అలహాబాద్ చేరుకున్నాను” అని పాండే చెప్పారు. ముండేరా హోల్సేల్ మార్కెట్కు ఆ సరుకును తీసుకెళ్తే ఎవ్వరూక కొనలేదని, దాన్ని కోత్వా ముబారక్పూర్ గోడౌన్లో పెట్టానని పాండే అన్నారు. రెండ్రోజుల్లో సరుకును అమ్ముతానని చెప్పారు. పాండే గురించి తెలుసుకున్న పోలీసులు అతనికి టెస్టులు నిర్వహించి.. సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి అతనికి వ్యాధి లక్షణాలు లేవని పోలీసు అధికారి అర్వింద్ కమార్ సింగ్ చెప్పారు.