
రాను రాను.. మనుషుల్లో శాడిజం పెరిగిపోతోంది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నాడు మనిషి. ఆస్తి కోసం కన్నవారిని హతమార్చడం.. ఆస్తి లాక్కొని ఇంటి నుండి గెంటేయడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వికారాబాద్ లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం 80 ఏళ్ళ వృద్దరాలైన తల్లిని, పక్షవాతంతో బాధపడుతున్న తమ్ముడిని ఇంటి నుంచి గెంటేసాడు ఓ నీచుడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో దారుణం జరిగింది. పోషణ భారమైందని 80 ఏళ్ళ వయసున్న కన్న తల్లి సత్యమ్మను,పక్షవాతంతో భాదపడుతున్న తమ్ముడు మహిపాల్ రెడ్డిని ఇంట్లో నుండి గెంటేశాడుగోవర్ధన్ రెడ్డి అనే నీచుడు. దీంతో ఎనభై ఏళ్ళ వయస్సులో పక్షవాతంతో ఉన్న కొడుకును తీసుకొని ఎటుపోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది తల్లి. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది సత్యమ్మ.
ALSO READ | టెస్టుల కోసం వచ్చి కుప్పకూలిన వ్యక్తి.. నిమ్స్ కార్మికుడు అలా చేయడంతో బతికేశాడు !
కూతుళ్లు కూడా తనను చూసుకునేందుకు ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది సత్యమ్మ.సత్యమ్మకు సంతానంగా ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉండగా అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి. చిన్న కొడుకు మహిపాల్ భార్య నాళుగేళ్ళ క్రితం చనిపోగా...తను పక్షవాతంతో భాదపడుతూ పొలం వద్ద గుడిసెలో నివాసముంటున్నాడని...అప్పటి నుండి మొత్తం ఆస్థి గోవర్ధన్ రెడ్డి అనుభవిస్తున్నాడని తెలిపింది సత్యమ్మ.
సత్యమ్మ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అతన్ని పిలిచి గట్టిగా మందలించారు. దీంతో పాశ్చాతాప బడ్డ గోవర్ధన్ తల్లిని తమ్మున్ని ఇంటికి తీసుకెళ్ళాడు.గతంలో కూడా రెండు మూడు సార్లు తల్లిని గెంటేసే ప్రయత్నం చేయగా అడ్డుకున్నట్లు తెలిపారు గ్రామస్తులు.