సింగరేణి సొంతంగా కార్పొరేట్ హాస్పిటల్..ఏటా రూ.400కోట్లతో వైద్యసేవలు

సింగరేణి సొంతంగా కార్పొరేట్ హాస్పిటల్..ఏటా రూ.400కోట్లతో వైద్యసేవలు
  • కార్పొరేట్ హాస్పిటల్​ఏర్పాటుపై  సింగరేణి నజర్
  • -హైదరాబాద్​లో సొంతంగా ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు
  • వైద్య సేవల కోసం ఏటా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్న యాజమాన్యం
  • రూ.100 కోట్లకు పైగా కార్పొరేట్  వైద్యానికే..
  • నష్ట నివారణతో పాటు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు

కోల్​బెల్ట్, వెలుగు:సింగరేణి కార్మికులకు కార్పొరేట్​ స్థాయి వైద్యాన్ని సొంతంగా అందించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు, డిస్పెన్సరీలను మరింత బలోపేతం చేయడంతో పాటు సొంతంగా హైదరాబాద్​లో కార్పొరేట్​ స్థాయి సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. 

కొంత కాలంగా సింగరేణి ఆసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని, మందుల కొరత నెలకొందని, స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తితే కార్పొరేట్​ ఆసుపత్రులకు పంపించకుండా, సొంత ఆసుపత్రుల్లో కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ఇటీవల సింగరేణి సీఎండీ ఎన్. బలరాంనాయక్​ ఆదేశించారు. ఆసుపత్రుల్లో అవసరమైన సౌలతులకు సంబంధించి ప్రపోజల్స్​ పంపించాలని అన్ని ఏరియా ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. నివేదికల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవడంపై యాజమాన్యం కసరత్తు చేస్తోంది.

ఏటా రూ.400 కోట్లు ఖర్చు..

సింగరేణి వ్యాప్తంగా రామకృష్ణాపూర్, గోదావరిఖని, భూపాలపల్లి, బెల్లంపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందులో ఏరియా ఆసుపత్రులు,21 డిస్పెన్సరీలు ఉన్నాయి. 170 మంది వైద్య సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో కొందరు స్పెషలిస్టు డాక్టర్లు కూడా ఉన్నారు. 43వేల మంది సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. 

ఏరియా ఆసుపత్రులు, డిస్పెన్సరీల నిర్వహణకు ఏటా రూ.400 కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు చాలా ఆసుపత్రుల్లో కార్పొరేట్​ స్థాయి ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కూడా ఉంది. అయితే చిన్న జబ్బుకే హైదరాబాద్​లోని కార్పొరేట్​ ఆసుపత్రులకు పంపించడంతో మూడేళ్లలో సింగరేణిపై రూ.100 కోట్ల అదనపు భారం పడింది. దీనిపై సింగరేణి సీఎండీ ఇటీవల అసంతృప్తి వ్యక్తంచేశారు. సింగరేణిలోని ఆసుపత్రులను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల వైద్యులు, ఆఫీసర్లతో సీఎండీ రివ్యూ చేశారు. రోగులను రిఫర్​ చేయడాన్ని తగ్గించి సింగరేణి ఆసుపత్రుల్లో చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

స్పెషలిస్టు వైద్యుల కొరత తీర్చడంపై నజర్..

సింగరేణి ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీర్చేందుకు యాజమాన్యం రెడీ అవుతోంది. కంపెనీ డాక్టర్లలో కొందరు నిపుణులు ఉన్నప్పటికీ, వారు వైద్యం అందించకుండా ప్రతి చిన్న కేసును రిఫర్​ చేస్తున్నారని, దీనిని మానుకోవాలని యాజమాన్యం ఆదేశించింది. ప్రధానంగా ఆర్థో, చిల్డ్రన్స్, ఐ, జనరల్​ ఫిజీషియన్, జనరల్​ సర్జన్లను పూర్తి స్థాయిలో ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించింది. 

కార్డియాలజిస్టు, న్యూరో విభాగానికి సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్లను కాంట్రాక్ట్​ పద్దతిలో తీసుకోవడానికి చర్యలు చేపట్టింది. వీరు వారంలో ఒకటి రెండు రోజులు ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేలా కసరత్తు చేస్తున్నారు. చాలా కాలంగా గుండె , న్యూరో స్పెషలిస్టు డాక్టర్ల నియామకం చేయలేదు. అలాగే సింగరేణి ఆసుపత్రుల్లో పని చేయడానికి డాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో కాంట్రాక్ట్​ పద్దతిలో సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

హైదరాబాద్​లో కార్పొరేట్​ హాస్పిటల్..

సింగరేణి ఆధ్వర్యంలో హైదరాబాద్​లో కార్పొరేట్​ స్థాయి సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు యాజమాన్యం ప్రణాళికలు చేస్తోంది. ఈ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉంచనుంది. గుండె సంబంధిత వైద్య నిపుణులు కోల్​బెల్ట్​ ఏరియాల్లో పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. 

ఈ క్రమంలో హైదరాబాద్​లో ఆసుపత్రి ఏర్పాటు చేస్తే వారి సేవలు వినియోగించుకోవచ్చని యాజమాన్యం భావిస్తోంది. దీంతో పాటు వారానికోసారి వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పిల్లలకు వ్యాక్సినేషన్​ చేపడుతుండగా, ఇక నుంచి సొంతంగా సింగరేణి ఆసుపత్రుల్లో ప్రతిరోజు వ్యాక్సినేషన్​ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.

మందుల కొరతపై దృష్టి..

సింగరేణి ఆసుపత్రులు, పర్చేజ్​డిపార్ట్​మెంట్ల మధ్య సమన్వయ లోపంతో అవసరమైన మందులు సకాలంలో ఆసుపత్రులకు చేరడం లేదు. ఈ క్రమంలో సింగరేణి ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. మందుల నిల్వలు, అవసరమైన మందులకు సంబంధించిన వివరాలను పంపించాలని, అత్యవసరమైతే స్థానికంగా కొనుగోలు చేయాలని యాజమాన్యం సూచించింది. 

కొన్ని ఏరియా ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు, మందుల కోసం ప్రతిపాదనలు పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించిన సీఎండీ, వెంటనే ప్రపోజల్స్​ పంపించాలని ఆదేశించారు.