60 ఏండ్ల చరిత్ర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి వెంటాడుతున్న నష్టాలు

60 ఏండ్ల చరిత్ర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి వెంటాడుతున్న నష్టాలు

అది 60 ఏండ్ల చరిత్ర కలిగిన కంపెనీ. ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ. నాణ్యమైన సిమెంట్ ఉత్పత్తి పరిశ్రమగా పేరొందింది. రోజుకు వెయ్యి టన్నుల ఉత్పత్తితో రికార్డు నెలకొల్పింది. నాగార్జునసాగర్​, శ్రీరాంసాగర్​లాంటి ఎన్నో గొప్ప ప్రాజెక్టులకు సిమెంట్ ను అందించింది. వేలాది మంది కార్మికులకు పని కల్పించింది. అలాంటి కంపెనీ ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయింది. కోట్లల్లో అప్పులు, కరెంట్ బిల్లులతో కుదేలైంది. యాజమాన్యం కంపెనీని బ్రేక్ డౌన్ చేసేసింది. 8 నెలలుగా ఉత్పత్తిని నిలిపివేసింది. తిరిగి ఓపెన్ చేస్తరా? లేక శాశ్వతంగా క్లోజ్ చేస్తరా? తెలియని పరిస్థితి నెలకొంది.

మంచిర్యాల, వెలుగు: ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన మంచిర్యాల సిమెంట్​కంపెనీ (ఎంసీసీ) భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కంపెనీని బ్రేక్ డౌన్ చేయడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఉత్తరాదికి చెందిన కొంతమంది పారిశ్రామికవేత్తలు 1956లో మంచిర్యాలలో అసోసియేటెడ్​సిమెంట్ కంపెనీ (ఏసీసీ)ని నెలకొల్పారు. ఈ ప్రాంతంలో సిమెంట్​ఉత్పత్తికి కావాల్సిన సున్నపురాయి, బొగ్గు, నీటి వనరులతో పాటు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడంతో పట్టణం సమీపంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. రోజుకు వెయ్యి టన్నుల సామర్థ్యంతో1958లో సిమెంట్​ఉత్పత్తిని ప్రారంభించారు. 2000 సంవత్సరం వరకు నిరంతరాయంగా నడిచిన ఏసీసీ.. ఆ తర్వాత క్రమంగా నష్టాలబాట పట్టింది. దీంతో 2006లో మంచిర్యాలకు చెందిన కొంతమంది వ్యాపారవేత్తలకు ఈ కంపెనీని అమ్మేశారు. వారు దీనిని మంచిర్యాల సిమెంట్​ కంపెనీ (ఎంసీసీ)గా పేరు మార్చి నిర్వహిస్తున్నారు. ప్రమోటర్ల మధ్య సమన్వయ లోపంతో ఈ కంపెనీ నష్టాల బాటలో పయనిస్తున్నట్లు తెలిసింది. కొన్నేళ్లుగా రూ.కోట్లల్లో కరెంటు బిల్లులు పేరుకుపోవడం, వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ.కోట్ల అప్పులు ఉండడం, ఇటీవల సిమెంట్​ ఉత్పత్తి వ్యయం పెరగడం తదితర కారణాలతో ఎనిమిది నెలల క్రితమే యాజమాన్యం ప్లాంట్​ను బ్రేక్​డౌన్​ చేసింది.

రోజుకు వెయ్యి టన్నులు…

దేశవ్యాప్తంగా ఏసీసీ యాజమాన్యం కింద 18 సిమెంట్​ కంపెనీలను నెలకొల్పగా, అప్పటి ఉమ్మడి ఏపీలో ఇదే తొలి కంపెనీ. ఇది దక్షిణ భారతదేశంలోనే నాణ్యమైన సిమెంట్​ఉత్పత్తి పరిశ్రమగా పేరొందింది. పూర్తిగా జర్మనీ​ టెక్నాలజీతో అప్పట్లోనే రోజుకు వెయ్యి టన్నుల సిమెంట్​ను ఉత్పత్తి చేయడం ఒక రికార్డుగా ఉండేది. ఏసీసీ యాజమాన్యం సిమెంట్ రంగంలో అన్ని రకాల ప్రయోగాలను ఇదే ప్లాంట్​లో చేపట్టేది. ఇక్కడ సక్సెస్ ​అయిన ఫార్ములాను ఇతర కంపెనీల్లో ప్రవేశపెట్టేది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఏసీసీ సిమెంట్​కు విపరీతమైన డిమాండ్​ఏర్పడింది. భవన నిర్మాణాలకే కాకుండా భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సైతం ఈ సిమెంట్​ను వినియోగించేవారు. ఉమ్మడి ఏపీలో నాగార్జునసాగర్​, శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులను ఈ సిమెంట్​తోనే నిర్మించారు. సముద్ర గర్భంలోని ఆయిల్, గ్యాస్​నిక్షేపాలను వెలికితీసే ఓఎన్​జీసీ ప్లాంట్లకు ఏసీసీలో ఉత్పత్తి చేసిన ఆయిల్​వెల్​ సిమెంట్​ను ఉపయోగించారు.ఈ క్రమంలోనే పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్​జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఏసీసీ ఊతమిచ్చింది. దేవాపూర్​లో ఓరియంట్ సిమెంట్​కంపెనీ, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బసంత్​నగర్​లలో సిమెంట్​కంపెనీల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చింది. మేజర్, మైనర్​ఇరిగేషన్​ ప్రాజెక్టులతో పాటు నిర్మాణ రంగం అభివృద్ధిలో ఏసీసీ పాత్ర ఎంతో ఉంది.

వెయ్యి నుంచి 92కు…

ఏసీసీలో గతంలో సుమారు వెయ్యి మంది వరకు ఉద్యోగులు, కార్మికులు పనిచేసేవారు. ఎంసీసీగా రూపాంతరం చెందిన తర్వాత కార్మికుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. అదే సమయంలో వందలాది మంది పర్మినెంట్ కార్మికులు రిటైర్​అయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోలేదు. అడపాదడపా కాంట్రాక్ట్​కార్మికులను తీసుకున్నప్పటికీ వారిని పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం 92 మంది మాత్రమే పర్మినెంట్​కార్మికులు మిగిలారు.
ఎనిమిది నెలలుగా సిమెంట్​ ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ.. వీరు ప్రతిరోజు యథావిధిగా విధులకు హాజరై ఖాళీగా ఉంటున్నారు. వారికి సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. ఒకప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా మంచిర్యాల పేరును
నలుదిశలా చాటింది.

కష్టాల్లో కార్మికులు…

ఎంసీసీ కార్మికుల పరిస్థితి రెండేండ్లుగా దయనీయంగా మారింది. ఏసీసీ యాజమాన్యం కింద ఉన్నప్పుడు వేజ్ బోర్డ్ అమలు కాగా ప్రస్తుతం స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులందరికీ ఒకే తరహా వేతనం ఇస్తున్నారు. వీరికి కేవలం రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపే చెల్లిస్తున్నారు. 2019 సెప్టెంబర్ నుంచి ఈఎస్ఐ, పీఎఫ్ ప్రీమియం కార్మికుల వేతనాల నుంచి కట్ చేస్తున్నా యాజమాన్యం చెల్లించడం లేదు. దీంతో కార్మికులకు ఈఎస్ఐ వర్తించడం లేదు. బోనస్, గ్రాట్యుటీ, ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. క్యాంటీన్, అంబులెన్స్ సేవలను రెండేళ్లుగా నిలిపివేశారు. మూడేళ్ల నుంచి యూనిఫామ్స్, షూస్, రెయిన్ కోట్లు ఇవ్వడం లేదు. క్వార్టర్స్ కరెంట్ బిల్లులను కార్మికులే చెల్లిస్తున్నారు. క్లబ్, వెల్ఫేర్ ఫండ్ బంద్ చేశారు. జీతాలు మూడు నెలలకోసారి చెల్లిస్తున్నారని, పే స్లిప్పులు కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

50 ఏండ్లు నడపచ్చు

సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన వనరులన్నీ ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. సర్వాయిలొద్ది వద్ద 700 ఎకరాల్లోని క్వారీలో నాణ్యమైన లైమ్​స్టోన్​లభిస్తోంది. శ్రీరాంపూర్, మందమర్రిలో బొగ్గు గనులు, పక్కనే గోదావరి, పని చేయడానికి కార్మికులు అందుబాటులో ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి మెరుగైన రోడ్డు రవాణా, రైల్వే మార్గం ఉంది. ఎంసీసీని మరో 50 ఏళ్ల పాటు నడిపించడానికి అవకాశాలు ఉన్నాయని ఆ కంపెనీ రిటైర్డ్​ క్వాలిటీ కంట్రోల్​ఆఫీసర్​ ఎన్.ఆర్​.శ్యామ్ తెలిపారు.

ఉత్పత్తి మొదలెట్టాలి  

– గత కొన్నేళ్లుగా ఎంసీసీ సరిగా నడవకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎనిమిది నెలల నుంచి బ్రేక్ డౌన్ చేశారు. తిరిగి ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. మేమంతా ఎప్పటిలాగే డ్యూటీలకు వెళ్లి ఖాళీగా ఉంటున్నాం. నెలనెలా జీతాలు ఇవ్వాలి. సిమెంట్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలి.

– బీరయ్య, ఎంసీసీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి

ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నం

ప్రస్తుతం మార్కెట్ ధరలతో సిమెంట్ ఉత్పత్తి గిట్టుబాటు కావడం లేదు. అందుకే ప్లాంట్ ను బ్రేక్ డౌన్ చేశాం. అయినా కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నాం. అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి సెట్ కాగానే తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడానికి మేనేజ్​మెంట్ ​ప్రయత్నిస్తోంది.

– విద్యాసాగర్ రావు, ఎంసీసీ జీఎం