
మంచిర్యాల, వెలుగు : ల్యాండ్ను సర్వే చేసేందుకు రూ. లక్ష డిమాండ్ చేసిన మంచిర్యాల మండల డిప్యూటీ సర్వేయర్ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ మంచిర్యాల డీఎస్పీ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి 307 సర్వే నంబర్లోని భూమిని సర్వే చేయాలని నెల కింద మంచిర్యాల మండల డిప్యూటీ సర్వేయర్ పోలం మంజులను కలిశారు. దీంతో పని పూర్తి కావాలంటే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ఫోన్పే ద్వారా రూ. 16,500 ట్రాన్స్ఫర్ చేయించుకుంది.
అలాగే అనధికారికంగా చైన్మన్గా పనిచేస్తున్న ప్యాగ ఉదయ్కుమార్ అనే వ్యక్తి ద్వారా రూ.10 వేలు వసూలు చేయించింది. తర్వాత రూ. 30 వేలు ఇస్తేనే సర్వే రిపోర్ట్ ఇస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. ఆఫీసర్లు పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేయగా.. డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో బుధవారం తహసీల్దార్ ఆఫీస్కు వచ్చి డిప్యూటీ సర్వేయర్ మంజుల, చైన్మన్గా పనిచేస్తున్న ఉదయ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు.