
- ప్రతిపాదనల దశలోనే ముల్కల్ల గోదావరి బ్రిడ్జి
- రాళ్లవాగు హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపనతో సరి
- రూ.250 కోట్లతో ఇటీవలే కరకట్ల పనులు షురూ
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్పోర్ట్స్ స్డేడియానిదీ అదే పరిస్థితి
- వానాకాలం రాకతో పనులకు ఆటంకం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.వందల కోట్లతో వివిధ పనులకు సాంక్షన్లు ఇచ్చింది. ఇందులో కొన్ని స్పీడ్గా జరుగుతుండగా, మెజారిటీ వర్క్స్ స్లోగా నడుస్తున్నాయి. మరికొన్ని పనులు హడావుడిగా స్టార్ట్ చేసి ఆపేశారు. ఇంకా పలు కీలక పనులు ఏడాదిన్నర నుంచి ప్రతిపాదనల దశలోనే మగ్గుతున్నాయి. ఈసారి వర్షాకాలం ముందుగానే వచ్చి వానలు పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లో వర్షాలు జోరందుకునే చాన్స్ ఉంది. దీంతో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక పనులు వానాకాలం తర్వాతే ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతిపాదనల్లోనే గోదావరి బ్రిడ్జి
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల నడుమ గోదావరి నదిపై నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి నేటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్నది. మంచిర్యాల, అంతర్గాం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2018లో అప్పటి సీఎం కేసీఆర్ రూ.125 కోట్లతో బ్రిడ్జిని సాంక్షన్ చేశారు. 2023 ఎలక్షన్ల ముందు అంచనా వ్యాయాన్ని రూ.165 కోట్లకు పెంచి టెండర్ పిలిచింది. అయితే పలు ప్రాంతాల్లో చేసిన పనుల బిల్స్ భారీగా పెండింగ్ ఉండడంతో అవి క్లియర్ చేస్తేనే ఈ పనులు చేస్తానంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు.
ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆ బ్రిడ్జిని క్యాన్సల్ చేయించారు. ప్రత్యామ్నాయంగా ముల్కల్ల శివారులో గోదావరిపై దాదాపు రూ.450 కోట్లతో మరో బ్రిడ్జికి ప్రపోజల్స్ చేశారు. దీనికి ఇంకా ప్రభుత్వ ఆమోదం లభించలేదు. ఇదిలా ఉండగా బీజేపీ, బీఆర్ఎస్ మంచిర్యాల, అంతర్గాం బ్రిడ్జి రద్దును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేపై కమిషన్ల ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పాత ప్లేస్ లోనే తక్కువ ఖర్చుతో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనితో ఎమ్మెల్యే సైతం అపోజిషన్ లీడర్లపై విమర్శల దాడికి దిగుతున్నారు. అందరూ కలిసి గోదావరికి రాజకీయ రంగు పులమడంతో దానికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియడంలేదు.
రాళ్లవాగు బ్రిడ్జి పనులు పెండింగ్
మంచిర్యాల బైపాస్ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర రాళ్లవాగుపై రూ.30 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే నిరుడు మార్చిలో ఆర్బాటంగా శంకుస్థాపన చేశారు. ఏడాది గడిచినా ఆ పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవలే వాగులో సాయిల్ టెస్ట్ కోసం డ్రిల్లింగ్ చేశారు. తాజాగా లక్ష్మి టాకీస్ నుంచి పాత మంచిర్యాల వరకు, ఐబీ నుంచి శ్రీనివాస టాకీస్ వరకు రూ.198 కోట్లతో సిక్స్ లేన్ రోడ్డు సాంక్షన్ అయ్యింది. దీంతో రాళ్లవాగు బ్రిడ్జి పనులను ఈ ప్యాకేజీలోనే చేర్చి నిర్మించనున్నట్టు సమాచారం.
కరకట్టలు పూర్తయ్యేదెన్నడో..
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి వరద ఎగతన్నడంతో రాళ్లవాగు పోటెత్తి మంచిర్యాల టౌన్లోని పలు కాలనీలు నీటమునుగుతున్నాయి. ముంపు ముప్పును శాశ్వతంగా నివారించేందుకు గత ప్రభుత్వం రాళ్లవాగుకు కరకట్టల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి చేతులెత్తేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.250 కోట్లతో కరకట్టలకు ఆమోదం తెలిపి ఇటీవలే ఫండ్స్ కేటాయించింది. దీంతో ఈమధ్యనే రాళ్లవాగు కరకట్టల నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. వర్షాకాలం తర్వాతే పనులు స్పీడందుకునే అవకా శాలున్నాయి.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్టేడియం
గత బీఆర్ఎస్ సర్కారు మంచిర్యాల ఐబీ ఆవరణలో రూ.7.60 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులు చేపట్టింది.ఆ తర్వాత ఫండ్స్ కొరతలో నిలిచిపోయాయి. ఎమ్మెల్యే పీఎస్సార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తొలగించి అక్కడ రూ.350 కోట్లతో 650 బెడ్స్ కెపాసిటీతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎంసీహెచ్ను నిర్మిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రస్తుత కూరగాయల మార్కెట్లోనే నిర్మించేందుకు పనులు స్టార్ట్ చేసినా ముందుకు సాగడం లేదు. మంచిర్యాల సాయికుంటలోని మున్సిపల్ జాగలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం ప్రపోజల్స్కే పరిమితమైంది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్తో పాటు అధికారులు పలుమార్లు స్థలాన్ని సందర్శించినా ముందడుగు పడలేదు. భూదాన్ భూముల్లో నిర్మించతలపెట్టిన సబ్ జైలు పనులదీ అదే పరిస్థితి.