
దండేపల్లి, వెలుగు: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లలాంటివని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం దండేపల్లి మండలం మేదరిపేటలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. దండేపల్లి మండలంలో 600 మందికిపైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. మండలంలోని గుడిరేవు, కొండాపూర్, లక్సెట్టిపేట మండలంలోని మోదెలలో గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, తపాలాపూర్ నుంచి దండేపల్లి మండలం మీదుగా లక్సెట్టిపేట చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎంపీడీవో ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రవీణారెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీలు కాంతారావు, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ కూలీలకు ఎక్స్ గ్రేషియా అందజేత
ఉపాధి హామీ పనుల్లో గాయపడిన కూలీలకు ఎమ్మెల్యే ఎక్స్ గ్రేషియా అందజేశారు. మండల కేంద్రంలో గతేడాది మే 17న ఉపాధి కూలీ పని ముగించుకుని ఆటో ట్రాలీలో తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ సాగునీటి కాలువలో పడి మహిళలు గాయపడ్డారు. గాయపడిన వేమూనూరి కమలకు రూ.1,18819, గోపె హేమకు రూ.67,499, బొమ్మెన సుజాతకు రూ. 56,755, ఎనగందుల స్వప్నకు
రూ. 32,558లు ప్రభుత్వం నుంచి మంజూరైనా చెక్కులను అందజేశారు. ఇదే సంఘటనలో చనిపోయిన బంగారు మల్లవ్వ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు ఇటీవలే అందజేశారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
లక్సెట్టిపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్సెట్టిపేటలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో 30 పడకల ఆస్పత్రి భవనం పూర్తి కావచ్చిందని, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్ భవనాలు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు చింత అశోక్, పింగళి రమేశ్, ఎండీ ఆరిఫ్, నాగభూషణం, ఎం.స్వామి తదితరులు పాల్గొన్నారు.