తహసీల్దార్ ఆఫీసుల్లో లంచాలు.. పని కావాలంటే ఫోన్ పే.. గూగుల్ పే కొట్టు!

తహసీల్దార్ ఆఫీసుల్లో లంచాలు.. పని కావాలంటే ఫోన్ పే.. గూగుల్ పే కొట్టు!
  • ‘ఎంఆర్​ఓ సార్​కు’ కొట్టిన ఫోన్​పే స్క్రీన్​ షాట్​ సోషల్​ మీడియాలో వైరల్  
  • సీఎంవో నుంచి వచ్చిన దరఖాస్తుకు రెవెన్యూ ఆఫీసర్లు రూ.40 వేలు డిమాండ్ 
  • మంచిర్యాల జిల్లా భీమారం తహసీల్దార్ ఆఫీసులో బాహాటంగానే లంచాలు

మంచిర్యాల(జైపూర్), వెలుగు: అవినీతి ఆఫీసర్లు బరితెగిస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా లంచం సొమ్మును ఫోన్​పే, గూగుల్​పే  చేయించుకుంటున్నారు. ఆఫీసర్లు నేరుగా తమ అకౌంట్లలోకి, లేదంటే కారు డ్రైవర్లు, తమ సన్నిహితుల ఖాతాల్లోకి డబ్బులను ట్రాన్స్​ఫర్  చేయించుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం తహసీల్దార్ ఆఫీసులో ఇలాంటి తంతే జరిగింది.  

భూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న బాధితుల నుంచి ఆఫీసర్లు భారీగా లంచాలు వసూలు తీసుకుంటున్నారనే  ఆరోపణలు వస్తున్నాయి.  గతేడాది నవంబర్​30న ల్యాండ్​ఎక్స్​టెండ్​కరెక్షన్​కోసం బాధితుడి నుంచి తహసీల్దార్​ రూ.10వేల లంచం తీసుకున్నట్లు తెలిసింది. కాగా చిదుర్ల భిక్షపతి పేరుతో ‘ఎంఆర్ వో సార్​’ అంటూ  రూ.10వేలు ఫోన్​పే చేశాడు.  ఆ స్క్రీన్​షాట్​ ప్రస్తుతం లోకల్​వాట్సప్​గ్రూపుల్లో వైరల్ గా మారింది.  అదే ఏడాది  జనవరి 9న నాలా కన్వర్షన్​ కోసం మరో వ్యక్తి నుంచి రూ.10వేలు ఫోన్​పే చేయించుకున్నట్లు తెలిసింది.

దీంతో పాటు మండలానికి చెందిన ఓ  ఓ వ్యక్తి  భూవివాదంపై సీఎంవోలో ఫిర్యాదు చేస్తే అక్కడి నుంచి అధికారులు తహసీల్దార్ ఆఫీసుకు ఎంక్వైరీకి పంపించారు. సమస్య జెన్యూన్​అయినప్పటికీ,  మోఖా మీద ఎంక్వైరీ చేసేందుకు బాధిత రైతు నుంచి రూ.40 వేలు తహసీల్దార్​ తీసుకున్నట్లు తెలిసింది. అలాగే మండలంలోని ఓ గ్రామంలో పట్టాదారు అనారోగ్యంతో బాధపడుతూ మంచంపై నుంచి లేవలేని పరిస్థితిలో ఉంటే అక్కడికి వెళ్లి ఆ భూమిని తమ పేరిట చేయడానికి రూ.15 వేల లంచం తీసుకున్నట్లు బాధితుడి కొడుకు ఆరోపించారు.

గత నెల 8న రెండు ట్రాక్టర్లలో అక్రమంగా మట్టిని తరలిస్తుంటే లోకల్ పోలీసులు పట్టుకొని వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఆ ట్రాక్టర్లకు ఫైన్ వేసి వదిలిపెట్టేందుకు రెవెన్యూ అధికారులు రిలీజ్ ఆర్డర్ పై సంతకాల కోసం ఎంతో కొంత ముట్టజెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ ​కారు డ్రైవర్​కు ఫోన్​పే చేశారు.  

ఓ వెంచర్ లో భూములను గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక ప్లాటుకు రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నట్టు ఆ వెంచర్ యజమానులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై ఎంక్వైరీ పేరుతో వసూళ్ల దందాకు తెరతీయడంతో తహసీల్దార్​సదానందంపై ఉన్నతాధికారులు ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిసింది