ఆన్ లైన్ లో లంచాలు..కూపీ లాగుతున్న ఏసీబీ... మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అనుమానాస్పద లావాదేవీలు

ఆన్ లైన్ లో లంచాలు..కూపీ లాగుతున్న ఏసీబీ... మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అనుమానాస్పద లావాదేవీలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల సబ్​ రిజిస్ర్టార్​ ఆఫీసులో అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయి. శుక్రవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ జూనియర్​ అసిస్టెంట్​ యూపీఐ అకౌంట్​లో లెక్కలో లేని రూ.70 వేలను అధికారులు గుర్తించారు. ఇది లంచమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇలానే మరో ఇద్దరి ఖాతాల్లోనూ లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. 

పెన్సిల్​రాతలు గల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సాయంత్రం 7 గంటలకు సబ్​ రిజిస్ర్టార్​ ప్రియాంకను నస్పూర్​లోని ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లి విచారించారు. ఆ తరువాత మంచిర్యాలలోని ఆమె నివాసంలో సోదాలు చేశారు. ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు రెగ్యులర్​ఉద్యోగులు, ఇద్దరు ప్రైవేట్​ వ్యక్తుల ద్వారా లంచాలు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఒకరు డాక్యుమెంట్​ రైటర్ల దగ్గర లంచం వసూలు చేస్తే... మరొకరు ఆ డబ్బులను అధికారులు, సిబ్బందికి పంపకాలు చేస్తారని సమాచారం. ఇల్లీగల్​ లే ఔట్లలో ప్లాట్లు రిజిస్ర్టేషన్​ చేయడానికి ఒక్కో డాక్యుమెంట్​కు రూ.30 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు.