- తెలంగాణ ప్రజలు అహంకారాన్ని భరించరు: మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ ఆధిపత్యం, అహంకారమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ అహంకారానికి బుద్ధిచెప్పాలనే ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, అహంకారాన్ని భరించరన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న అవలక్షణాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందన్నారు. అభయ హస్తం చాప్టర్1లో చెప్పినట్లు ప్రజాస్వామిక పాలన అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ను ప్రశ్నించినందుకు తనపై, రేవంత్, కోదండరాం, బండి సంజయ్పై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారని గుర్తుచేశారు.
కేసీఆర్ది దొరల పాలన అని, దానికి ఆయన మంత్రివర్గమే సాక్ష్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 శాతం, మిగతా వారికి 13 మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్ మొదటి కేబినెట్ జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే నలుగురు మంత్రులు ఉండగా, మిగతా కులాలకు చెందిన వారు కనీసం ఇద్దరు కూడా లేరన్నారు. ప్రజాస్వామ్యయుతంగా సామాజిక న్యాయం ఉన్నంతకాలం తమ మద్దతు ఉంటుందని, దాన్ని విస్మరిస్తే నిరసనలు, ఆందోళనలు ఉంటాయని హెచ్చరించారు.