మందమర్రి బొగ్గు గనుల్లో 65శాతం ఉత్పత్తి : జీఎం జి.దేవేందర్​

మందమర్రి బొగ్గు గనుల్లో 65శాతం ఉత్పత్తి : జీఎం జి.దేవేందర్​
  • వివరాలు వెల్లడించిన జీఎం దేవేందర్

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా గనుల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి టార్గెట్​ను సాధించేందుకు రోజువారీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ఏరియా జీఎం జి.దేవేందర్​అన్నారు. శనివారం మందమర్రి జీఎం ఆఫీస్​ కాన్ఫరెన్స్ హాల్​లో మీడియా సమావేశంలో మే నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత తదితర వివరాలు వెల్లడించారు. మే నెలలో ఏరియాలోని బొగ్గు గనుల్లో 2,24,000 టన్నుల బొగ్గును సాధించాలని టార్గెట్​ పెట్టుకోగా 65 శాతంతో 1,45,506 టన్నులు సాధించినట్లు తెలిపారు. కేకే-5 గనిలో 17 వేల టన్నులకు గాను 17,064 టన్నులతో 100 శాతం ఉత్పత్తి సాధించిందన్నారు. కాసిపేట-1 గనిలో 69శాతం, కాసిపేట-2 గనిలో 72 శాతం, శాంతిఖని గనిలో 73 శాతం, కల్యాణిఖని ఓపెన్​ కాస్ట్​ గనిలో 59 శాతం ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. 

కేకే ఓసీపీలో కేవలం 44 శాతం ఉత్పత్తి వచ్చిందని, ఓవర్ బర్డెన్​ తొలగింపే ఇందుకు కారణమన్నారు. శాంతిఖనిలో రికార్డు స్థాయిలో 265 మీటర్ల పొడవున బొగ్గును తొలిచి ఉత్పత్తి చేశారన్నారు. 2019 నుంచి ఇది మూడో అత్యధిక  బొగ్గు ఉత్పత్తి అని పేర్కొన్నారు. నీటి బిందువు-జలసింధువు కార్యకక్రమంలో భాగంగా సింగరేణి సీఎండీ ఆదేశాలతో మందమర్రి ఏరియాలో ఐదు కొత్త చెరువులు తవ్వించామని, ఏరియా పరిసరాల్లోని మరో 5 చెరువుల్లో పూడిక తీతపనుల చేపట్టాల్సి ఉందన్నారు. సమావేశంలో ఏరియా ఏస్వోటుజీఎం విజయప్రసాద్, ఇంజనీర్ వెంకటరమణ, డీజీఎంలు రాజన్న, ప్రసాద్, రవీందర్, పర్సనల్​​ మేనేజర్ ​శ్యాంసుందర్, డివైపీఎం మైత్రేయబంధు, సీనియర్ ​పీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాంపూర్ ఏరియాలో 99 శాతం 

నస్పూర్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని  శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. శనివారం జీఎం ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. ఏరియాలో గత నెల ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. అర్కే 5 గని 98 శాతం, అర్కే6 గని 96 శాతం, అర్కే7గని 103 శాతం, అర్కే న్యూటెక్ గని 105 శాతం, ఎస్ఆర్పీ 1 గని 73 శాతం, ఎస్ఆర్పీ 3గని 70 శాతం, ఐకే1ఏ గని 82శాతంతో భూగర్భ గనులు 90 శాతం ఉత్పత్తి సాధిచాయన్నారు.

 ఓసీపీలు 103శాతంతో శ్రీరాంపూర్ ఏరియా మొత్తంగా 99 శాతం ఉత్పత్తి సాధించాయని తెలిపారు. ఇటీవల గని ఆఫీసర్లలపై వచ్చిన అవినీతి అరోపణపై విచారణ జరుగుతోందని, కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. సీనియర్ పీవో కాంతారావు, ఏజీఎం (ఫైనాన్స్) బీభత్స తదితరులు పాల్గొన్నారు.