
- రీసెర్చ్లను ప్రోత్సహిస్తున్నం
- జీనోమ్ వ్యాలీలో బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించిన మాండవీయ
శామీర్ పేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం స్వదేశీ రీసెర్చ్ లను ప్రోత్సహిస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధి తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీలో ఐసీఎంఆర్ నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్(ఎన్ఏఆర్ ఎఫ్ బీఆర్) సెంటర్ను మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. తర్వాత మాండవీయ మాట్లాడుతూ.. కేంద్రం పరిశోధనలకు ప్రోత్సాహాన్ని అందించిందని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. 21వ శతాబ్దపు బయోమెడికల్ పరిశోధనలో దేశాన్ని కీలకమైన ప్రపంచ శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని ఈ సెంటర్కలిగి ఉందన్నారు. 100 ఎకరాల స్థలంలో 20 అడ్వాన్సుడ్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్స్తో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ, బయోటెక్ హాఫ్ లో కొత్త క్యాంపుగా అవతరించిందన్నారు. ఇది జెనోటిక్, ఇతర వ్యాధుల కారణాలు, రోగనిర్ధారణ ట్రీట్మెంట్అవగాహనను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. జంతువుల ద్వారా వచ్చే డిసీజెస్, నివారణపై రీసెర్చ్ జంతువుల ద్వారా సంక్రమించే డిసీజెస్, వ్యాధి నివారణ, ట్రీట్మెంట్తదితర అంశాలపై జంతువులపై రీసెర్చ్ చేయాల్సి ఉందని మాండవీయ తెలిపారు.
సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి
బీజేపీ బలోపేతానికి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీ సెల్, డాక్టర్ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నెరవేర్చని వాటిని ప్రజలకు వివరించాలన్నారు. సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా సోషల్ మీడియా టీం పనిచేయాలని, వాటిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగి కేసీఆర్ ను ప్రజలు నిలదీసేలా పనిచేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకులు పాల్గొన్నారు.