- ఫార్మా కంపెనీలకు మినిస్టర్ వార్నింగ్
న్యూఢిల్లీ: కల్తీ మందులు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ను ఆదేశించినట్లు కెమికల్స్, ఫెర్టిలైజర్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా చెప్పారు. క్వాలిటీ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పార్మాస్యూటికల్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు ఆయన సూచించారు. మందుల తయారీ సక్రమంగా సాగుతోందా లేదో తనిఖీ చేయడానికి ప్రత్యేక స్క్వాడ్స్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ స్పెషల్ స్క్వాడ్స్ దేశంలోని 139 కంపెనీలను తనిఖీ చేశాయని, ఇందులో 105 కంపెనీలపై యాక్షన్ తీసుకున్నామని అన్నారు. 31 కంపెనీలలో ప్రొడక్షన్ నిలిపివేయాలని ఆదేశాలివ్వగా, మరో 50 కంపెనీల ప్రొడక్ట్ లైసెన్సులు క్యాన్సిల్ చేసినట్లు మంత్రి చెప్పారు. మరో 73 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని వెల్లడించారు. ఇండియన్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) ప్రతినిధులతో మంగళవారం మినిస్టర్ సమావేశమయ్యారు. ఫార్మా రంగంలోని ఎంఎస్ఎంఈలు ముఖ్యంగా క్వాలిటీ విషయంలో శ్రద్ధ వహించాలని మాండవీయ ఈ సందర్భంగా సలహా ఇచ్చారు.