న్యూఢిల్లీ: గతంలో దిగుమతి చేసుకుంటున్న 35 ఏపీఐల (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రీడియెంట్స్) తయారీ దేశంలోనే స్టార్టయినట్లు కేంద్ర మంత్రి మన్షుఖ్ మాండవీయ చెప్పారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీము కిందనే ఈ ప్రాజెక్టులు ఏర్పాటయినట్లు వెల్లడించారు. సుమారు 53 ఏపీఐల కోసం మనం దిగుమతులపైనే 90 శాతం ఆధారపడుతున్నామని, అందులో ఈ 35 ఏపీఐలు ఉన్నాయని పేర్కొన్నారు. 32 మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు పై 35 ఏపీఐల తయారీ చేపట్టాయని అన్నారు. దీంతో ఇప్పుడు మనం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.
పీఎల్ఐ స్కీముకు ఫార్మాస్యూటికల్స్ రంగం నుంచి మంచి ఆదరణ దొరికిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఏపీఐల తయారీ ఇక్కడే మొదలవనుందని చెప్పారు. కిందటేడాది ఫార్మా రంగం కోసం రూ. 15 వేల కోట్లతో పీఎల్ఐ స్కీమును ప్రభుత్వం ప్రకటించింది. సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, మైలాన్, సిప్లా, కాడిలా వంటి కంపెనీలు ఇన్సెంటివ్లకు పీఎల్ఐ స్కీముకు అర్హత పొందాయి. చాలా ఏపీఐలకు గ్లోబల్ సప్లయర్గా చైనానే నిలుస్తోంది. మన దేశంలోని ఎక్కువ కంపెనీలు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి.