
‘నా ట్రేడింగ్ అకౌంట్లో కేవలం రూ. 5 వేలే ఉన్నాయి. కానీ, బ్యాంక్ నిఫ్టీ 41,600 కాల్ ఆప్షన్ అమ్ముడైనట్టు ఉంది. లాస్ రూ. 4 లక్షలు చూపిస్తోంది. ఎగ్జిట్ అవుదామంటే కుదరడం లేదు’ అని ఒక ట్రేడర్...‘నేను చేయని ట్రేడ్స్ కనిపిస్తున్నాయి. మార్జిన్ 50 శాతం పడిపోయింది. నిఫ్టీ లాట్ సైజ్ 25 గా చూపిస్తోంది. ఆర్డర్లను క్యాన్సిల్ చేయడానికి అవ్వడం లేదు. ట్రేడ్స్ ఎగ్జిట్ అవుదామంటే కుదరడం లేదు’..అని మరొక ట్రేడర్ ఇలా చాలా మంది ఫిన్వేషియాకు చెందిన బ్రోకరేజ్ శూన్య బారిన పడి నష్టపోయారు. టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో ఈ నెల 13 న చాలా మంది ఆప్షన్స్ ట్రేడర్ల ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాలేదు. ఇప్పటికే ఉన్న ట్రేడ్స్ నుంచి ఎగ్జిట్ కావడానికి కుదరలేదు. తాము చేయని ట్రేడ్స్ కూడా కనిపిస్తున్నాయని, రూ. లక్షల్లో మార్క్ టూ మార్కెట్ లాస్ చూపిస్తోందని చెబుతున్నారు. ఇలా చాలా మంది బ్రోకరేజ్ యాప్ పనిచేయకపోవడంతో నష్టపోతున్నారు. కొంత మంది తమ క్యాపిటల్లో 10 శాతం పోతే, మరికొంత మంది 50 శాతం వరకు నష్టపోయారు. శూన్య జీరో యాప్ బ్రోకరేజ్ కంపెనీ. ఆప్షన్స్ ట్రేడింగ్పై బ్రోకరేజి చార్జీలను ఈ కంపెనీ వసూలు చేయడం లేదు. కానీ, ఇండస్ట్రీలో బెస్ట్ అనుకున్న బ్రోకరేజ్ల యాప్లలోనూ టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ఏడాదిన్నర క్రితం జెరోధా, అప్స్టాక్స్లలోనూ టెక్నికల్ సమస్యల వలన ట్రేడ్లు ఎగ్జిట్ అవ్వలేదు.
ఆప్షన్స్ ట్రేడింగ్ భారీగా పెరగడమే..
ఆప్షన్స్ ట్రేడింగ్ వేగంగా పెరుగుతోంది. దీంతో బ్రోకరేజ్ కంపెనీల సర్వర్లపై ప్రెజర్ పెరుగుతోంది. ఫలితంగా టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి. కేవలం ఇండియాలోనే కాదు యూఎస్లలో కూడా ఇలాంటి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వలన రెగ్యులేటరీలపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. ఒరిజినల్గా ఆప్షన్స్ను హెడ్జింగ్ (రిస్క్ తగ్గించుకోవడం) కోసం తీసుకొచ్చారు. కానీ, రాను రాను ఇవి లాటరీ టికెట్స్లా మారాయి. తక్కువ టైమ్లోనే భారీ లాభాలు పొందే వీలుండడంతో ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న ట్రేడర్లు ఆప్షన్స్కే ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా ట్రేడింగ్ వాల్యూమ్స్ భారీగా పెరుగుతున్నాయి. 2019– 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం మధ్య ఇండెక్స్ ఆప్షన్స్ రోజువారీ టర్నోవర్ 10 రెట్లు పెరిగి రూ.45,000 కోట్లకు ఎగిసింది. స్టాక్ ఆప్షన్స్లో డైలీ టర్నోవర్ 5 రెట్లు పెరిగి రూ.3,800 కోట్లకు చేరుకుంది. ఇదే టైమ్లో స్టాక్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్లో డైలీ టర్నోవర్ 50 % కూడా పెరగకపోవడాన్ని గమనించాలి.సెబీ స్టడీ ప్రకారం,డెరివేటివ్ ట్రేడింగ్ చేస్తున్న ప్రతీ 10 మందిలో తొమ్మిది మంది నష్టపోతున్నారు. ఇందులోనూ రీజనబుల్ లాభాలు సంపాదించేవాళ్లు తక్కువగానే ఉన్నారు.